సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కోరంటిలో వైద్యసేవలు మరింత విస్తరించనున్నాయి. జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ల చికిత్సకు ప్రత్యేక కేంద్రమైన నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో రోగులకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రూ.13కోట్ల వ్యయంతో నూతన భవన సముదాయాన్ని నిర్మిస్తున్నది. ఈ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇది పూర్తయితే రోగులకు విశాలమైన ఓపీ భవనం అందుబాటులోకి వస్తుంది.
రోజు 300 నుంచి 500 మంది..
330 పడకల సామర్థ్యమున్న కోరంటి దవాఖానకు ప్రతి రోజు 300 నుంచి 500 మంది రోగులు ఓపీ సేవల కోసం వస్తుంటారు. ఇక వర్షాకాలం, చలికాలంలో అయితే ఈ సంఖ్య వెయ్యి దాటుతుంది. ఎంతటి విషజ్వరాలైనా ఇట్టే తగ్గించగలిగే ప్రత్యేకతలు ఉన్న ఈ దవాఖానలో ఐపీ కంటే ఓపీ సేవలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న భవనాలు చాలా ఇరుకుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓపీ భవనాన్ని విస్తరించడంతో పాటు పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త భవన సముదాయాన్ని నిర్మించాలని సంకల్పించింది. ఈ క్రమంలోనే కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టి..పనులను వేగవంతంగా సాగిస్తున్నారు అధికారులు.
ప్రత్యేక కౌంటర్లు
నూతన భవన నిర్మాణం పూర్తయితే రోగులకు విశాలమైన ఓపీ భవనం అందుబాటులోకి వస్తుంది. రద్దీ పెరిగినా.. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఇందులో స్త్రీ, పురుషులకు వేర్వేరుగా, చిన్నపిల్లలకు ప్రత్యేక ఓపీ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరీక్షల కేంద్రం చాలా ఇరుకుగా, శిథిలావస్థలో ఉంది. నూతన భవన సముదాయం అందుబాటులోకి వస్తే అందులోనే ప్రత్యేకంగా విశాలమైన వైద్యపరీక్షల కేంద్రం, ఆధునిక ల్యాబ్, నమూనాల సేకరణ కేంద్రం వంటివి ఉంటాయి. వీటితో పాటు సూపరింటెండెంట్ చాంబర్, ఆర్ఎంవో, వైద్యుల గదులు కూడా ఈ భవన సముదాయంలో ఉండనున్నాయి.
మరింత మెరుగైన సేవలు..
రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రస్తుతం ఉన్న ఓపీ భవనం సరిపోవడం లేదు. అది చాలా ఇరుకుగా ఉండడంతో సీజనల్ సమయంలో రోగుల రద్దీ పెరిగినప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుత ఓపీ భవనం ఇరుకుగా ఉండడం వల్ల ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు ఎక్కువ. నూతన భవన నిర్మాణ పనులు టీఎస్ఎంఐడీసీ ఆధ్వర్యంలో వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ భవన సముదాయం అందుబాటులోకి వస్తే ఓపీ రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయి.
– డాక్టర్ శంకర్, సూపరింటెండెంట్, కోరంటి దవాఖాన