వారాంతపు సంతల్లో చోరీలు
ఆటకట్టించిన మేడ్చల్ పోలీసులు
ఆరుగురి రిమాండ్
మేడ్చల్ రూరల్, జూలై 6: సంతల్లో సెల్ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను మేడ్చల్ పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నారు.బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రామలింగరాజు వివరాలు వెల్లడించారు.జవహర్నగర్కు చెందిన సెల్ఫోన్ల చోరీలో పాత నేరస్తుడైన మనుపాటి బాలకృష్ణ సెల్ఫోన్ దొంగతనాల్లో ఆరితేరిన వాడు. ఒడిశాకు చెందిన నరేశ్దాస్, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన మేకల మురళి, అంబటి శివ, అనంతపూర్కు చెందిన జగన్నాథం బాలరాజు, మరో ముగ్గురు మైనర్లతో కలిపి ముఠాను తయా రు చేశాడు. ఈ ముఠా వారాంతపు సంతలు, జనసమ్మర్థ ప్రాంతాల్లో సెల్ఫోన్ చోరీకి పాల్పడి, బాలకృష్ణకు తీసుకువచ్చి ఇచ్చేవారు.అతడు నగరంలోని జగదీశ్ మార్కెట్ లోని దుకాణం నిర్వహిస్తున్న మహ్మద్ అదిల్ ఆలీ అలియాస్ ఆజార్కు విక్రయించే వారు.
విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు మంగళవారం మేడ్చల్లో అనుమానాస్పదంగా తిరుగుతూ బాలకృష్ణ కంటపడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకుని, సీఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నేర విభాగ ఎస్సై నర్సింహ గౌడ్ బృందం విచారించింది. ఈ విచారణలో జవహర్నగర్లో నివాసం ఉండే బాలకృష్ణ ఆధ్వర్యంలో ముఠా వారాంతపు సంతలు, జన సమ్మర్థ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతునట్టు తేలింది. ముఠాలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. వారికోసం గాలిస్తున్నారు. ముఠా నుంచి 100 ఫోన్లు, రూ.1,25,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఐదుగురితో పాటు సెల్ఫోన్లు తీసుకుంటున్న అదిల్ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చి, రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ రామలింగరాజు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో వారిపై కేసులు నమోదై ఉన్నాయన్నారు. చాకచక్యంగా సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను పట్టుకున్న మేడ్చల్ పోలీస్లను అభినందించారు. రివార్డు కోసం సీపీకి పంపిస్తామన్నారు.ముఠాలో ఉన్న మైనర్లను కూడా త్వరలో పట్టుకుని, జువైనల్ హోంకు తరలిస్తామని వెల్లడించారు. సమావేశంలో సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్సైలు నర్సింహగౌడ్, మురళీధర్,శంకర్ గౌడ్, రఘురాం, సిబ్బంది పాల్గొన్నారు.