మేడ్చల్, మార్చి 1: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్నుల వసూళ్లకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వందశాతం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న ఏడు మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లలో లక్ష్యం పూర్తి చేసేందుకు పలు పద్ధతులను అనుసరిస్తున్నారు. పన్నుల చెల్లింపునకు గడువు ఇంకా 29 రోజులు మాత్రమే ఉండ గా కొన్ని మున్సిపాలిటీల్లో 60 శాతం కూడా మించలేదు. లక్ష్యానికి దూరంగా ఉన్న మున్సిపాలిటీల్లో అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రత్యేక చర్యలు
పన్నులు 100 శాతం వసూలు చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బిల్ కలెక్టర్లు వార్డులు, డివిజన్ల వారీగా బకాయిల జాబితాను తీసుకొని, ఇంటింటికి వెళ్లి వసూలు చేస్తున్నారు. గడువు సమీపిస్తుండటంతో ఆదివారం, సెలవు రోజుల్లో సైతం పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. కార్యాలయ పని వేళలను ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటలుగా మార్చారు.
సకాలంలో పన్నులు చెల్లించి, అభివృద్ధికి సహకరించాలని కొన్ని మున్సిపాలిటీల్లో మైక్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. మొండి బకాయిల వసూళ్లకు బోడుప్పల్ మున్సిపాలిటీలో రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. డ్రైనేజీ కనెక్షన్ను తొలగించి, ఇంటి గేట్ సీజ్ చేయడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ బిల్ కలెక్టర్లకు లక్ష్యాన్ని విధిస్తూ సాయంత్రం సమీక్ష నిర్వహిస్తున్నారు.
బోడుప్పల్లో అత్యధిక వసూళ్లు
నియోజకవర్గంలోని బోడుప్పల్లో అత్యధికంగా ఆస్తిపన్నులు వసూలు చేశారు. రూ.22.48 కోట్ల డిమాండ్ ఉండగా, ఇప్పటి వరకు రూ.11.87 కోట్ల వరకు వసూలు చేశారు. ఇది 60.2 శాతంగా నమోదైంది. తూంకుంటలో అత్యధిక శాతం పన్ను వసూలైంది. ఆ మున్సిపాలిటీలో రూ.8.99 కోట్లు డిమాండ్ ఉండగా రూ.6.34 కోట్ల వరకు వసూలైంది.
విధిగా పన్ను చెల్లించాలి
ఆర్థిక సంవత్సరం ఈనెల 31తో ముగియనున్నందున ప్రతి ఒక్కరూ విధిగా పన్నులు చెల్లించాలి. ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్స్, అడ్వైర్టెజ్మెంట్ పన్నులను చెల్లించి, అభివృద్ధికి సహకరించాలి. లేదంటే మున్సిపాలిటీ చట్టం ప్రకారం ఆస్తులను జప్తు చేస్తాం. నల్లా కనెక్షన్ను తొలగించడం లాంటి చర్యలు తీసుకుంటాం. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వంద శాతం వసూళ్లే లక్ష్యంగా ఇంటింటికీ తిరిగి పన్నులు వసూలు చేస్తున్నాం.
– రాములు, కమిషనర్, గుండ్లపోచంపల్లి, మేడ్చల్ మున్సిపాలిటీ
విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం…
జవహర్నగర్ కార్పొరేషన్లో వంద శాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా ముందు కెళ్తున్నాం. కార్పొరేషన్లోని ప్రతి కాలనీలో మైక్సెట్ ద్వారా ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నాం. పన్ను చెల్లించని ఇండ్లకు రెడ్ నోటీసులు జారీ చేశాం. మొండి బకాయిదారుల వద్దకు వెళ్లి, చెల్లింపు అవశ్యకతను వివరిస్తున్నాం. అయినా పన్నులు కట్టకుంటే గడువు ముగియగానే ఇంటిని జఫ్తు చేస్తాం. బిల్ కలెక్టర్ల్ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్రమత్తం చేస్తున్నాం.
– రామలింగం, కమిషనర్ జవహర్నగర్ కార్పొరేషన్