మేడ్చల్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాను ఏర్పాటు చేయడంతో పాటు పారిశ్రామికాభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా, మిషన్ కాకాతీయ ద్వారా చెరువుల అభివృద్ధి, శివారు ప్రాంతాల అభివృద్ధి, 13 మున్సిపాలిటీల ఏర్పాటు, ఐటీ రంగ ఏర్పాటుకు రూ.400 కోట్ల కేటాయించి జిల్లా రూపురేఖలు పూర్తిగా మార్చేశారు.
9,412 పరిశ్రమలు.. 15వేల కోట్ల పెట్టుబడులు
కేసీఆర్ ప్రభుత్వం 2014 నుంచి 2023 నవంబర్ నెల వరకు 9,412 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చిన క్రమంలో పరిశ్రమల ఏర్పాటుతో రూ. 15 వేల 49 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో 2 లక్షల 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.
గ్రామానికి సురక్షిత తాగు నీరు
ఓఆర్ఆర్ వెలుపల ఉన్న 104 గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు మిషన్ భగీరథ పథకం ద్వారా రూ.160 కోట్లు వెచ్చించి శివారు ప్రాంతా ప్రజల దాహర్తిని పరిష్కరించారు.
221 కోట్లతో 489 చెరువుల అభివృద్ధి
రూ.221 కోట్లు వెచ్చించి జిల్లాలోని 489 చెరువులను సుందరీకరించారు. ప్రతి ఏడాది 20 శాతం చెరువులకు మరమ్మతులు చేపట్టారు.
గ్రామీణ ప్రాంతాల్లో సకల వసతులు
జిల్లాలోని 61 గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించింది. పట్టణ, ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ దామాలు, భవనాలు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీరోడ్ల నిర్మాణానికి ప్రతి ఏడాది ప్రత్యేక నిధులను ఖర్చు చేసింది. మొత్తం రూ.900 కోట్లు కేటాయించగా.. కొన్ని పూర్తికాగా మరికొన్ని పనులు జరుగుతున్నాయి.
రూ.400 కోట్లతో ఐటీ హబ్
మేడ్చల్ జిల్లాలో రూ.400 కోట్లతో ఐటీ హబ్ నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసి టెండర్లను పూర్తి చేసింది. 18వేల చదరపు అడుగుల్లో ఐటీ హబ్ నిర్మాణం పూర్తయితే 15 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి.