పది,ఇంటర్ పరీక్షలపై అధికారులతో
అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి
మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 26 : మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో ఇంటర్, 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఇంటర్, పదో తరగతి పరీక్షలపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు మే 6వ తేదీ నుంచి, 10వ తరగతి పరీక్షలు మే 23వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, ముందు గా పరీక్ష కేంద్రాలను సందర్శించి వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా, గాలి వెలుతురు, టాయిలెట్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వైద్య సిబ్బందిని నియమించాలని సూచించారు.
ప్రశ్న పత్రాలు బందోబస్తుతో పోలీసుల భద్రతతో ఆయా పరీక్ష కేంద్రాలకు తరలించాలని సూచించారు.పరీక్షల సమయంలో నిరంతరం విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచడంతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. రవాణా శాఖ అధికారులు బస్సుల పనితీరు పర్యవేక్షించాలని, పరీక్ష కేంద్రాల చుట్టు ప్రక్కల జిరాక్స్ షాపులను మూసివేసి 144 సెక్షన్ విధించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కిషన్, జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి,ఆర్డీఓ మల్లయ్య, ఏఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.