Drugs | కేపీహెచ్బీ కాలనీ, మార్చి 8: నైజీరియా నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్ను హైదరాబాద్లో విక్రయించడానికి వచ్చిన వ్యక్తితోపాటు కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 13 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కేపీహెచ్బీ కాలనీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నైజీరియా వాసి ఆజా జాషువా ఓకే.. అంతర్జాతీయ బిజినెస్ వీసాతో ముంబైకి చేరుకున్నాడు. నైజీరియా దేశీయులతో కలిసి వస్త్ర వ్యాపారం ప్రారంభించాడు. కొద్దిరోజులకు తమ వారితో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకొన్నాడు.
హైదరాబాద్ నగరవాసి గంగిరెడ్డి గారి రోహిత్ అమెరికాలో బీబీఏ చదువుతున్నప్పుడే డ్రగ్స్కు బానిసయ్యాడు. తర్వాత కాలంలో ముంబై యాక్టింగ్ స్కూల్లో చేరి ఆజా జాషువా ఓకే చిక్కు అనే వ్యక్తిని కలిసి టాక్సిన్ కొనుగోలు చేసి సేవించేవాడు. 2011లో ముంబై నగరంలో అతను డ్రగ్స్ విక్రయిస్తుండగా ఆజా జాషువా ఓకేను పోలీసులు పట్టుకొని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. 2023లో బెయిల్పై జైలు నుంచి విడుదలైన తర్వాత మరల డ్రగ్స్ వ్యాపారం ప్రారంభించాడు.
ఈ క్రమంలో ఈనెల 6న రోహిత్… అవైజ్ అనే నకిలీ పేరుతో డాల్ఫిన్ బస్సులో టికెట్లు బుక్ చేసి.. డ్రగ్స్ తీసుకుని వచ్చాడు. ఆజా జాషువా ఓకే నగరంలోని మియాపూర్ మెట్రో స్టేషన్ కు చేరుకున్నాడు. విశ్వసనీయ సమాచారంతో మాటు వేసిన పోలీసులు ఈనెల ఏడో తేదీ రాత్రి 11 గంటల ప్రాంతంలో అడ్డగుట్టలోని విశాల్ సొసైటీ వద్దకు చేరుకోగానే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆజా జాషువా ఓకే, గంగి రెడ్డి గారి రోనిత్ లపై కేసు నమోదు చేశారు. వారి వద్ద 13 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను, 2 సెల్ ఫోన్లు, రూ.80 వేల నగదు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ లింగం, డీఐ రవికుమార్ బృందాన్నిఏసీపీ శ్రీనివాస్ రావు, సీఐ రాజశేఖర్ రెడ్డి అభినందించారు.