సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ ) : ప్రజావాణి(Prajavani)లో ప్రజలు నుంచి వచ్చిన విన్నపాలను వారంలోగా పరిష్కరించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Mayor Vijayalakshmi) అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం మేయర్ ఎల్బీనగర్ జోన్ కార్యాలయంలో ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించారు. గ్రేటర్లో ప్రజల సమస్యల పరిష్కారానికి సర్కిల్, జోనల్ స్థాయిలో నేటి నుంచి ప్రారంభించామని, ఆదే విధంగా జనవరి 22 నుంచి ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తామన్నారు.
ప్రతి దరఖాస్తుపై తీసుకున్న చర్యపై ఆర్జీదారునికి లిఖిత పూర్వకంగా పంపించాలని ఆదే విధంగా నివేదికను శనివారంలోగా అందజేయాలని జోనల్ కమిషనర్ పంకజను ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు తమ వార్డులోని సమస్యలను మేయర్కు విన్నవించారు. కార్పొరేటర్లు వివరించిన పలు సమస్యలపై వెంటనే పరిష్కరించాలని మేయర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ పంకజ, మెయింటనెన్స్ ఎస్ఈ ఆశోక్రెడ్డి, డీసీలు , టౌన్ప్లానింగ్, ఎంటమాలజి, వెటర్నరీ, శానిటేషన్ విభాగం అధికారులు పాల్గొన్నారు.