ఎల్బీనగర్, జనవరి 8: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. సోమవారం జీహెచ్ఎంసీ వ్యాప్తంగా అన్ని జోన్లలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతి పత్రాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొవిడ్ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమం ఆగిపోయిందని, దీనిని తిరిగి పునరుద్ధరిస్తున్నామన్నారు. అన్ని జోన్ల పరిధిలో సోమవారం ప్రారంభించామని, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 22న ప్రారంభిస్తామన్నారు.ఎల్బీనగర్ జోన్లో ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని, జోన్లో 21 ఫిర్యాదులు అందాయని తెలిపారు. ప్రజా వాణిలో వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ధ్యేయంగా తాము పనిచేస్తామన్నారు. ఓయో, హాస్టల్స్లో అనుమతులు, సౌకర్యాలపై డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకాశ్రెడ్డితో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు.
జీహెచ్ఎంసీ వ్యాప్తంగా కుక్కల సమస్యలు ఉన్నాయని అధికారులతో సమావేశం ఏరాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. టౌన్ప్లానింగ్ విభాగంపై 9 ఫిర్యాదులు వచ్చాయని, జోనల్ కమిషనర్లు, ఉప కమిషనర్లు, టౌన్ప్లానింగ్ విభాగం అధికారులతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి అక్రమణలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రోడ్డు అక్రమణలతో పాటుగా, నివాసాల అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ, టౌన్ప్లానింగ్ విభాగం సీపీ ప్రసాద్రావు, ఇంజినీరింగ్ విభాగం ఎస్ఈ అశోక్రెడ్డిలతో పాటుగా వివిధ విభాగాల అధికారులు , కార్పొరేటర్లు పాల్గొన్నారు.