సిటీబ్యూరో,మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఆహార కల్తీని నివారించేందుకు ఫుడ్సేఫ్టీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. నగరంలో ఆహార కల్తీ నియంత్రణకు ఏర్పాటు చేసిన ఫుడ్ ఆన్ వీల్స్ ద్వారా తప్పనిసరిగా తనిఖీలు చేసి కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. సోమవారం ఫుడ్సేఫ్టీపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో హెల్త్ అడిషనల్ కమిషనర్ శృతి ఓఝాతో కలిసి మేయర్ సమీక్షించారు.
ఫుడ్సేఫ్టీ అధికారుల పరిధిలో ఆహార పదార్థాల షాపులు తనిఖీలు చేసి కల్తీ ఉన్న పక్షంలో వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మేయర్ పేర్కొన్నారు. కొందరు అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందని, అలాంటి వారు వారి పనితీరును మార్చుకోవాలని లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో రోజువారి తనిఖీల వివరాల సమాచారం పంపాలని ఆదేశించినా ఇప్పటివరకు ఏ ఒక అధికారి కూడా సమాచారం ఇవ్వలేదని మేయర్ అసహనం వ్యక్తం చేశారు. స్ట్రీట్ఫుడ్స్ హోటల్స్, రెస్టారెంట్లు రెగ్యులర్ తనిఖీలు చేయాలన్నారు.
ఆహార కల్తీ నియంత్రణలో ఫుడ్సేఫ్టీ ఆఫీసర్లు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సరిళ్ల వారీగా తనిఖీ సందర్భంగా సంబంధిత సరిల్ అధికారుల సమన్వయంతో ముందుకెళ్లాలని మే యర్ సూచించారు. కల్తీ నియంత్రణకు స్ట్రీట్ వెండర్స్కు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. హోటల్స్, రెస్టారెంట్లో ఉన్న కిచెన్లను పరిశీలించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన రెస్టారెంట్లు హోటళ్లకు నోటీసు జారీ చేయడం, లైసెన్స్ సస్పెండ్ చేయడం వెంటనే చేయాలని సూచించారు. ఫుడ్ లైసెన్స్ లేని హోటల్స్పై కఠిన చర్యలు చేపట్టాలని అడిషనల్ కమిషనర్ శృతి ఓఝా అన్నారు. హార్ట్స్ రెస్టారెంట్ జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, ఏఎస్రావు నగర్లో ప్రోటీన్, మోర్ షాపులో అపరిశుభ్రమైన వాతావరణం ఉన్నందున వారి లైసెన్స్ను రద్దు చేసి కేసు నమోదు చేసినట్లు ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బాలాజీ రాజు, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.