Hyderabad | హైదరాబాద్లోని గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. జైన్ స్కూల్ సమీపంలో తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు.
బాధిత కుటుంబం ఆదివారం ఉదయం పెళ్లికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటం గుర్తించాడు. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి తనిఖీ చేయగా సుమారు 30 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.5 లక్షల నగదు చోరీకి గురైనట్లు తెలిసింది. వెంటనే బాధితుడు గోషామహల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగల కోసం గాలింపు చేపట్టారు.