Hyderabad | చార్మినార్, మార్చి 22: ఇద్దరు స్నేహితుల మధ్య 50 రూపాయల విషయంలో చోటుచేసుకున్న వివాదం కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటన చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఇన్స్పెక్టర్ గురునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. గులాబ్సింగ్బౌలి ప్రాంతంలో నివాసముంటున్న వాహిద్, దిల్షాద్ స్వస్థలం బిహార్. బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చి సిటీ కాలేజీ క్రాస్ రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వాహిద్(23) వద్ద దిల్షాద్ ఈ నెల 20న సాయంత్రం తిరిగి ఇస్తానని రూ.50 తీసుకున్నాడు.
సాయంత్రం దిల్షాద్ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో వాహిద్ అతడి వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వాలని కోరాడు. దీంతో దిల్షాద్ తన వద్ద ఉన్న చేతి గడియారం వాహిద్కు అందించి డబ్బు చెల్లించి తీసుకుంటానని చెప్పాడు. కొద్ది సేపటి తరువాత ఆ గడియారం తన సెంటిమెంట్ అని చెప్పి తీసుకున్నాడు. ఆ సమయంలో అది పనిచేయకపోవడంతో కావాలనే తన వాచ్ను పాడుచేశావని వాహిద్తో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటామాట పెరగడంతో దిల్షాద్ తన సోదరుడి ఇంట్లో నుంచి కత్తి తీసుకువచ్చి వాహిద్ కడుపులో రెండు సార్లు పొడిచి అక్కడినుంచి పారిపోయాడు. ఈ ప్రమాదంలో వాహిద్కు తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వాహిద్ పరిస్థితి మెరుగ్గా ఉన్నదని ఇన్స్పెక్టర్ గురు నాయుడు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.