శంషాబాద్ రూరల్, అక్టోబర్ 11: లోన్ యాప్ సిబ్బంది వేధింపుల నుంచి కాపాడాలని కోరుతూ బాధితుడు మంగళవారం శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మల్కారం గ్రామానికి చెందిన గూడురు గణేశ్ కొరియర్ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇంటి అవసరాల నిమిత్తం ఓ లోన్ యాప్ ద్వారా రుణం కోసం అప్లయ్ చేసుకున్నాడు.
యాప్ నిర్వాహకుల సూచన మేరకు వాట్సాప్ ద్వారా ఖాతా తెరిచాడు. మే 18న రూ.50 వేల రుణం కోసం అప్లయ్ చేసుకున్నాడు. అయితే, తొలుత రిజిస్ట్రేషన్ ఫీజు కింద 5 శాతం (రూ.2,500) చెల్లించాలని లోన్ యాప్ నిర్వాహకులు సూచించారు. దీంతో బాధితుడు ఒకసారి రూ.2,500, మరోసారి రూ. 10వేలు చెల్లించాడు. ఈ విధంగా పలుమార్లు రూ. 32వేలు వరకు చెల్లించాడు. అయినా లోన్ రాలేదు. అయినా.. రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ను చూపిస్తూ.. డబ్బులు ఇవ్వాలంటూ వేధిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.