సైదాబాద్, నవంబర్ 16: ఐఎస్ సదన్ చౌరస్తాలో బాంబు ఉందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించి, అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం అతడికి 18 రోజుల జైలు శిక్ష విధించింది. భార్య కాపురానికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను.. న్యాయం జరుగకపోవడంతో ఇలా చేశాను.. అంటూ పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించాడు.
పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ వ్యక్తి పోలీసు కంట్రోల్ రూమ్కు ఫొన్చేసి ఐఎస్ సదన్ చౌరస్తాలోని మందిర్, మసీద్ సమీపంలో బాంబు ఉన్నదంటూ చెప్పాడు. హుటాహుటిన బాంబు స్కాడ్, సైదాబాద్, సంతోష్నగర్, మాదన్నపేట, కాంచన్బాగ్ పోలీస్స్టేషన్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్డారు. ఎక్కడా బాంబు కనిపించలేదు. చివరికి బాంబు లేదని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా.. ఒకపక్క బాంబు కోసం గాలించిన పోలీసులు.. మరోపక్క పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చిన వ్యక్తి ఆచూకీ కోసం వేట మొదలుపెట్టారు. సమాచారం ఇచ్చిన వ్యక్తిని సంతోష్నగర్ పరిధిలోని రాజనర్సింహనగర్కు చెందిన మహ్మద్ అక్బర్ఖాన్గా గుర్తించారు.
ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతడు డీఆర్డీఎల్ ఎదురుగా ఉన్న ఓ వైన్షాప్ వద్ద ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో.. అతడి భార్య కొంతకాలంగా కాపురానికి రావడంలేదని, చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరుగలేదని, అందుకే ఇలా చేశానని సెలవిచ్చాడు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి 18 రోజుల జైలు శిక్ష విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి తెలిపారు.