హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ విలీనాన్ని పక్కనపెట్టి ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతున్నది. ఎన్నికల నిర్వహణ తథ్యమని తేలడంతో ఆర్టీసీలోని కార్మికసంఘాలు అప్రమత్తం అయ్యాయి. తెలంగాణలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు ఆగస్టు 2వ వారంలో నోటిఫికేషన్ రావొచ్చని తెలిసింది. ఆగస్టు చివరి లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయాలని చూస్తున్నట్టు సమాచారం.
దీంతో యూనియన్ల నేతలు ఈసారికి ప్రభుత్వం నిర్ణయించినట్టే ఎన్నికలకు వెళ్దామనే సంకేతాలను కార్మికులకు ఇస్తున్నారు. అధికారిక నోటిఫికేషన్ ఇంకా వెలువడకముందే డిపోలవారీగా వివిధ కార్మిక సంఘాల నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కార్మికులతో సమావేశాలు నిర్వహిస్తూ తమ సంఘానికే ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.