సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ):రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున భవిష్యత్తులో పెరిగే డిమాండ్ను తట్టుకునేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగకుండా, ప్రజలకు నాణ్యమైన కరెంటును అందించేందుకు పకడ్బందీగా కార్యాచరణను సిద్దం చేసుకోవాలని ఆయన సూచించారు. శనివారం మింట్కాంపౌండ్లో ఉన్న టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో భట్టి ఆధ్వర్యంలో విద్యుత్శాఖ సమీక్షాసమావేశం నిర్వహించారు.
ప్రధానంగా ప్రజలకు తాగునీటి అవసరాలకు, రైతుల వ్యవసాయసాగుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అవసరమైన విద్యుత్ను నిరంతరాయంగా అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వశాఖల నుంచి రావలసిన విద్యుత్ బకాయిల వసూళ్లపై దృష్టి సారించాలని, రెవెన్యూ వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేసి సంస్థల్లో ఆర్ధిక క్రమశిక్షణను పెంపొందించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వీ పాటిల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పీడర్-డీటీఆర్-వినియోగదారుల మ్యాపింగ్ ద్వారా విద్యుత అంతరాయాలను తక్షణమే గుర్తించి సరఫరాను పునరుద్దరించడం, ఫిర్యాదుల పరిష్కారం, ఖచ్చితమైన ఎనర్జీ ఆడిట్ నిర్వహించడం సాధ్యమవుతుందని చెప్పారు.