ప్యాట్నీ నాలా ఆధునీకరణకు రూ.10 కోట్లు కేటాయింపు
ఫలించిన ఎమ్మెల్యే సాయన్న, మర్రి రాజశేఖర్రెడ్డి కృషి
కంటోన్మెంట్, ఏప్రిల్ 19: కంటోన్మెంట్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ఎప్పటినుంచో బోర్డు పరిధిలోని పలు ప్రా ంతాలు ప్యాట్నీ నాలా ఆధునీకరణ చేయకపోవడంతో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారేవి. ఈ క్రమంలో గతేడాది నగరంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా ప్యాట్నీ నాలాలో పూడికతీతతో పాటు ఆధునీకరణ పనులు చేపట్టకపోవడంతో రసూల్పురా, పికెట్, బాలంరాయి వంటి ప్రా ంతాలు ముంపునకు గురయ్యాయి. దీంతో అప్పట్లో ఎమ్మెల్యే సాయన్న, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు సభ్యులు ప్యాట్నీ నాలా పనుల ఆధునీకరణకు సంబంధించి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంత్రి ప్రత్యక్షంగా బేగంపేట ప్యాట్నీ నాలాను పరిశీలించడంతో పాటు ఎమ్మెల్యే సాయన్న, మర్రి రాజశేఖర్రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు, బోర్డు అధికారులు, సభ్యులతో జీహెచ్ఎంసీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
తక్షణమే రూ.6కోట్లతో ప్యాట్నీ నాలా ఆధునీకరణ పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ను మంత్రి ఆదేశించారు. మొదటి దఫాగా నాలాలో పూడికతీత పనులు ప్రారంభించారు. ఇదే తరుణంలో నగరంలోని పలు నాలాల ఆధునీకరణలకు సంబంధించి ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీంట్లో భాగంగా ఎస్డీ రోడ్లోని కరాచీ బేకరీ నుంచి పికెట్ నాలా వరకు ఆధునీకరణకు పనులకు సంబంధించి రూ.10 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ఎస్డీ రోడ్లోని పికెట్ నాలా ప్రాంతాన్ని కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్తో కలిసి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ నాలా ఆధునీకరణకు ఉన్న నిధుల ఇబ్బందులు తొలగడంతో పనులు చురుగ్గా సాగనున్నాయని పేర్కొన్నారు. నాలా ఆధునీకరణ పనులకు రూ.10 కోట్ల నిధులు కేటాయించినందుకు మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే సాయన్న, మర్రిరాజశేఖర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.