మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు మరోసారి తమ నిరసన గళాన్ని వినిపించారు. ‘సేవ్ ది మధు పార్క్ రిడ్జ్’ పేరిట శుక్రవారం అపార్ట్మెంట్ మెయిన్ గేట్ వద్ద వారంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యను ప్రస్తావించి.. తమ ఇండ్లను కూల్చకుండా చూడాలని ప్రజాప్రతినిధులను కోరారు. దేశ నలుమూల నుంచి వచ్చి వివిధ రకాల ఉద్యోగాలు చేసుకుని పైసా పైసా కూడబెట్టి మధు పార్క్రిడ్జ్లో ప్లాట్లు కోనుగోలు చేశామని, అందరం ఒకే కుటుంబంలా జీవిస్తున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. కష్టపడి సొంతింటి కలను నిజం చేసుకుంటే తమ కలను కల్లగానే మారుస్తున్నారని విలపించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పేరుతో ఇండ్లను కూల్చి రోడ్డున పడేయొద్దని వేడుకున్నారు. ఇండ్లను ఎట్టి పరిస్థితిలో వదులుకునేది లేదని, ప్లకార్డులతో తమ ఆవేదన వ్యక్తం చేశారు.
బండ్లగూడ, మార్చి 20 (నమస్తే తెలంగాణ): కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారంతా ఇక్కడ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి జీవిస్తున్నామని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్వాసులు అన్నారు. ‘సేవ్ ది మధు పార్క్ రిడ్జ్’ పేరిట శుక్రవారం అపార్ట్మెంట్ మెయిన్ గేట్ వద్ద వారంతా శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యను ప్రస్తావించి.. తమ ఇండ్లను కూల్చకుండా చూడాలని తెలంగాణ ప్రజా ప్రతినిధులను వారు కోరారు. పైసా పైసా కూడబెట్టి మధు పార్క్రిడ్జ్లో ప్లాట్లు కోనుగోలు చేసి సొంతింటి కలను నిజం చేసుకుంటే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ తమ ఇళ్లను కూల్చేస్తామనడం సరికాదన్నారు.
ప్రభుత్వం దిగి వచ్చి తమ ఇండ్లను కూలుస్తామని ఇచ్చిన నోటిఫికేషన్ను వెనక్కి తీసుకునే దాకా నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు స్పష్టం చేశారు. రోజుకో రూపంలో అపార్ట్మెంట్లో ఉన్న కుటుంబాల సభ్యులంతా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసం మాధు పార్క్ అపార్ట్మెంట్ ఉన్న సర్వే నంబర్లోని భూ సేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. మా అపార్ట్మెంట్ కూల్చకుండా ఎన్ని నిర్మాణాలైనా చేపట్టండి. మాకెవరికీ ఇబ్బంది లేదు. మమ్మల్ని అకారణంగా నిర్వాసితులను చేస్తామంటేనే చూస్తూ ఊరుకోం. అపార్ట్మెంట్ను ఖాళీ చేసి వెళ్లాలంటే మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తాం.
– నబీ, అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రతినిధి
మాది కశ్మీర్ రాష్ట్రం. మేము హైదర్బాద్కు వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల క్రితం మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లో అన్ని పత్రాలు సక్రమంగా ఉండటంతో ఫ్లాట్ కొనుగోలు చేశాం. ఇప్పుడు ఇది బఫర్జోన్లో ఉందని, కూల్చి వేస్తామంటే మేము ఎక్కడికి పోవాలి. ఇష్టానుసారం హద్దులు మార్చడమే ఈ ప్రభుత్వం విధానమా? మా కుటుంబ సభ్యులందరం నాడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాం. అయితే ఆపార్టీ ఇలా ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తే భవిష్యత్లో ఒక్క ఓటు కూడా వేయం.
– మధుబాల, మధు పార్క్ రిడ్జ్
మధు పార్క్ అపార్ట్మెంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నాం. ప్రభుత్వం మా ఇండ్లను ఖాళీ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి ప్రశాంతతను కోల్పోయాం. నిత్యం ఏదో ఒక రకమైన భయం మమ్మల్ని వెంటాడుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గాంధీ సరోవర్ పేరుతో మా ఇల్లు కూలుస్తామంటున్నారు. మూసీ అభివృద్ధి చేసుకోమనండి .దానికి అందరం సహకరిస్తాం.కాని మా ఇంటి జోలికి వస్తే ఎంత వరకైనా వెళ్తాం కాని మా ఇంటిని వదిలే ప్రసక్తే లేదు.
– కృప జాగీర్దార్, మధు పార్క్ రిడ్జ్
గాంధీ సరోవర్ నిర్మాణం చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు అడిగారు? ఇప్పుడున్న బాపుఘాట్ను సక్రమంగా అభివృద్ధి చేస్తే సరిపోతుందని గాంధీ మనవడే చెబుతున్నారు. మూసీ ఒడ్డున ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. గాంధీ సరోవర్ కోసం ఇండ్లను కూలుస్తామనడం ప్రభుత్వానికి తగదు. ఇక్కడ ఎవరూ అమాయకులు లేరు. అందరం విద్యావంతులమే.. మా ఇండ్లను కాపాడుకోవడానికి ఎంతవరకైనా వెళ్తాం. ఎన్ని పోరాటాలైనా చేస్తాం.
– మధు అవస్థి, మధు పార్క్ రిడ్జ్