LRS | మియాపూర్ , మార్చి 7: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి, ఆ విషయాన్ని విస్మరించారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ధ్వజమెత్తారు. అంతేగాకుండా ఎల్ఆర్ఎస్ పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు సిద్ధం అయ్యారని ఆరోపించారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు ఉచితంగా అమలు చేసి తీరాల్సిందేనని, లేని పక్షంలో ప్రజల తరపున పెద్ద ఎత్తున ప్రభుత్వంపై పోరాడుతామని ఎమ్మెల్యే గాంధీ హెచ్చరించారు. ఎల్ఆర్ఎస్ను ఉచితం అమలు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు..
బల్దియా స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, పలువురు కార్పొరేటర్లు రాగం నాగేందర్యాదవ్, హమీద్ పటేల్, దొడ్ల వెంకటేశ్గౌడ్ మంజులరఘునాథ్రెడ్డి, సింధుఆదర్శ్రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబ సహా పార్టీ శ్రేణులలతో కలిసి జోనల్తో పాటు, తహసీల్దార్ కార్యాలయాల్లో గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయటం లేదన్నారు. 25 లక్షల ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని గాంధీ డిమాండ్ చేసారు. కొత్తగా దరఖాస్తుల ద్వారా డబ్బులు దండుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రూపాయి వసూలు చేయకుండా ప్రజల భూములను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, మహిళా నాయకులు, డివిజన్ల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.