సిటీబ్యూరో, జూలై 7(నమస్తే తెలంగాణ): భూములు, ప్లాట్ల యజమానులకు అత్యంత కీలకమైన లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) ప్రక్రియలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది. ఎల్ఆర్ఎస్-2020 కింద కొత్త దరఖాస్తులు చేసుకునేందుకు ఇకపై ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నెట్, ఐజీఆర్ఎస్ ద్వారా కొత్త దరఖాస్తులు సమర్పించేందుకు కల్పించిన తుది గడువు అధికారికంగా ముగిసిందని.. ఈమేరకు పురపాలక శాఖ జీవో నంబర్ 5509ను జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరి 28న విడుదల చేసిన జీవో నంబర్ 28 మేరకు కల్పించిన అవకాశం మంగళవారంతో ముగియడంతో కొత్త ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఒకవైపు కొత్త దరఖాస్తుల ప్రక్రియకు సర్కార్ పుల్స్టాప్ పెట్టిన సర్కార్ మరోవైపు గతంలో ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకున్నవారికి ఇప్పటికీ ప్రొసీడింగ్స్ అందకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలోనే దాదాపు 63వేల దరఖాస్తులు పలు దశల్లో పెండింగ్లో ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిశీలనలు, రెవె న్యూ, ఇరిగేషన్ విభాగాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వలన ఫైళ్లు ముందుకు కదలడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. గతంలో ప్రభు త్వం కల్పించిన 25శాతం ఫీజు రాయితీ వంటి ప్రోత్సాహకాలను వినియోగించినా.. సాంకేతిక ఇబ్బందులు, భూముల వర్గీకరణ సమస్యలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ వివాదాలు పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం వేలాది సంఖ్యలో పెం డింగ్లో పడ్డాయి. వందలాది దరఖాస్తులు రెవెన్యూ, ఇరిగేషన్ ఎన్వోసీలు లభించక నిలిచిపోయాయి. పాత దరఖాస్తులకు 2020 మార్కెట్ విలువల ప్రకారమే ఫీజులు లెక్కిస్తున్నా, జాప్యం వల్ల ప్లాట్ యజమానులపై ఆర్థిక భారం పడుతోంది.
ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ చేతికి రాకపోవడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతిలో ప్లాట్ ఉన్నా.. క్రమబద్ధీకరణ పత్రాలు లేకపోవడం వలన వాటిపై ఇళ్లు నిర్మించుకునేందుకు మున్సిపల్ అధికారులు భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం లేదు. ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు బ్యాంకులు హోమ్ లోన్లు, ప్లాట్ లోన్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. అదేవిధంగా అత్యవసర అవసరాల కోసం ప్లాట్లను అమ్ముకోవాలని, రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో కొనుగోలుదారులు ముందుకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. క్రమబద్ధీకరణ కానీ లే అవుట్లలో అధికారికంగా తాగునీటి కనెక్షన్లు, డ్రైనేజీ, సిమెంట్ రోడ్ల విస్తరణ పనులు నిలిచిపోయాయని, తాజా ఉత్తర్వుల నేపథ్యంలో భవిష్యత్లో అనధికారిక ప్లాట్ల బదిలీ మరింత కఠినతరం కానుంది. ప్రభుత్వం కొత్త దరఖాస్తుల స్వీకరణను ఉన్నఫళంగా నిలిపివేసిన నేపథ్యంలో… కనీసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పెండింగ్లో ఉన్న పాత దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి, వివిధ దశల్లో ఉన్న దరఖాస్తులకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ప్లాట్ల యజమానులు, రియల్ ఎస్టేట్ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.