బాలానగర్, జనవరి 11 : శ్రీగోదా రంగనాథస్వామి వార్ల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. గురువారం బాలానగర్ డివిజన్ పరిధి ఫిరోజ్గూడలో బాలానగర్ మాజీ కార్పొరేటర్ బ్రాహ్మణ వైష్ణవ సేవాసమితి అధ్యక్షుడు కాండూరి నరేంద్రాచార్య ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివార్ల కల్యాణం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కమణీయంగా జరిగింది.
జగదీశ్ మఠం వ్రతధర జీయర్స్వామి, శఠగోప రామానుజ జీయర్స్వామి శ్రీరంగంల పర్యవేక్షణలో జరిగిన స్వామివార్ల కల్యాణ మహోత్సవాలకు ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ సముద్రాల వేణుగోపాలచారి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై స్వామివార్లను దర్శించుకొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్, మూసాపేట మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్కుమార్, భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.