కరోనాపై యుద్ధం చేసేందుకు నగరమంతా ఒక్కటై లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ఉంటే..కొందరు మాత్రం అవసరం ఉన్నా లేకున్నా రోడ్లపైకి వస్తున్నారు. అందుకోసం అర్థం పర్థం లేని కారణాలను చెబుతున్నారు. ఏం చెప్పినా సరే.. పోలీసులు విని వదిలేస్తారులే..అనే ధోరణితో అబద్ధాలు కూడా చెప్పేస్తున్నారు. ఇది పోలీసుల సహనానికి ఓ పరీక్షగా మారుతున్నది. ఈ నేపథ్యంలోనే లాక్డౌన్ చెక్ పోస్టుల వద్ద పోలీసులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు.
కొన్ని చెక్పోస్టుల వద్ద కొంతమంది యువకుల ప్రవర్తన పోలీసులకు బాగా చిర్రెత్తిస్తున్నది. బాలానగర్ జోన్ పరిధిలోని ఓ చెక్ పాయింట్ వద్ద ఓ యువకుడు అత్యం త వేగంగా వెళ్తుండగా పోలీసులు ఆపారు. అదే సమయంలో అక్కడ ఉన్న బాలానగర్ డీసీపీ పద్మజ ఆ యు వకుడిని.. ఎక్కడికి వెళ్తున్నావంటూ ప్రశ్నించారు. తనకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని ఫోన్ తీసి ఆ సందేశం చూపించాడు. ఆ సందేశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ యువకుడి వాహనంపై 6800 రూపాయల విలువ గల 8 చలానాలు ఉన్నాయి. ఇందులో చలనాలు తప్ప డాక్టర్ అపాయింట్మెంట్ ఎక్కడుందని నిలదీస్తే..ఆ యువకుడు తప్పు ఒప్పుకున్నాడు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ యువకుడికి అప్పటికప్పుడు మరో వెయ్యి రూపాయలు జరిమానా విధించారు.
కొంతమంది నగరవాసులు ఇలా కుంటిసాకులు చెప్పి లాక్డౌన్ ను ఖాతరు చేయకుండా తప్పించుకునే ధోరణి అత్యంత ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కరోనావ్యాప్తిని నియంత్రించి అందరూ సురక్షితంగా -ఉండేందుకే ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని గుర్తు చేస్తున్నారు. ఒకరిద్దరి చేష్టల మూలంగా ఇంటిల్లిపాది కరోనా బారిన పడకుండా..సమష్టిగా కరోనాను అదుపు చేసేందుకు సహకరించాలని నగర పోలీసులు పిలుపునిస్తున్నారు.
మరో ఘటనలో ఒకే ఆటోలో ఐదుగురు ప్రయాణిస్తూ చెక్పాయింట్ వద్ద పోలీసులకు దొరికిపోయారు. లాక్డౌన్ సమయంలో ఎందుకంతమంది ప్రయాణిస్తున్నారని అడగ్గా.. ఒకరికి పాజిటివ్ రావడంతో దవాఖానలో చేర్చేందుకు అందరమూ కలిసి వెళుతున్నామని చెప్పారు. ఒక రోగితో కలిసి మిగిలిన ఐదుగురు ప్రయాణిస్తున్నారని తెలుసుకొని పోలీసులు విస్మయానికి గురయ్యారు. అప్పటికప్పుడు ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించారు.
మూసాపేట, మే19: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. బుధవారం ఉదయం కూకట్పల్లి పరిధి లోని మోతినగర్, మూసాపేట, భరత్నగర్, అల్లాపూర్లలో ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, బాలానగర్ డీసీపీ పద్మజతో కలిసి సీపీ సజ్జనార్ పర్య టించారు. నగరంలోని భవన నిర్మాణ కార్మికులు ఈ పాస్ తీసుకోవాలని, వారు పనిచేస్తున్న నిర్మాణ సంస్థ గుర్తింపు కార్డులైనా తమ వద్ద ఉంచు కోవాలన్నారు. ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.