Stephen Raveendra | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ వినియోగిస్తూ దొరికితే జీవితకాలం జైలు శిక్ష, జరిమానా తప్పదని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. గురువారం కమిషనరేట్లో ‘ది నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్-1985’పై ప్రొసిడ్యూరల్ హ్యాండ్బుక్ను పోలీసు ఉన్నతాధికారులతో కలిసి సీపీ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగంతో మెదడు, నాడీ వ్యవస్థ, రోగనిరోధకశక్తి దెబ్బతింటుందని, మతిమరుపు, ఏకాగ్రత లోపించడంతోపాటు ఆత్మహత్య ఆలోచనలు రేకెత్తుతాయని వివరించారు. డ్రగ్స్ వినియోగంతో జరిగే అనర్థాలు, ఎన్డీపీఎస్ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. పుస్తకాన్ని రాయడంలో సహకరించిన రిటైర్డ్ ఎస్పీ, సైబరాబాద్ ఓఎస్డీ ఎం మల్లారెడ్డి, ఏసీపీ ఎస్ రవీందర్లను అభినందించారు. కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) నారాయణ నాయక్, క్రైమ్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వర్, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ నికితాపంత్, అడ్మిన్ డీసీపీ యోగేశ్ గౌతమ్, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, మేడ్చల్ డీసీపీ సందీప్ పాల్గొన్నారు.