సమీపిస్తున్న క్రమబద్ధీకరణ గడువు
షేక్పేట మండలంలో 2104.. ఖైరతాబాద్లో 1181 దరఖాస్తులు
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్నవారి స్థలాలను క్రమబద్ధీకరించేందుకు మరోసారి అవకాశం కల్పిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 58, 59 కింద దరఖాస్తులు చేసుకునేందుకు మరో మూడు రోజుల గడువు మాత్రమే మిగిలింది. ఫిబ్రవరి 22న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ మార్చి 31తో ముగుస్తుండడంతో దరఖాస్తుల ప్రక్రియ ఊపందుకుంది. పెద్ద సంఖ్యలో ఇండ్ల యజమానులు మీ సేవా కేంద్రాలకు వచ్చి క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. నగరంలోనే అత్యధిక ప్రభుత్వ స్థలాలు కలిగిన మండలమైన షేక్పేట మండలంలో జీవో 58 కింద 2015లో సుమారు 3500 ఇండ్లను క్రమబద్ధీకరించారు. దీంతో పాటు సుమారు 750 మందికి పైగా జీవో నంబర్ 59 కింద క్రమబద్ధీకరణ అవకాశాన్ని వినియోగించుకున్నారు.
కాగా గత నెలలో మరోసారి క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించడంతో ఖైరతాబాద్, షేక్పేట మండలాల పరిధిలో భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. సోమవారం నాటికి షేక్పేట మండల పరిధిలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇండ్లు నిర్మించుకున్న 2104 మంది క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఖైరతాబాద్ మండల పరిధిలో 1181 మంది క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. – బంజారాహిల్స్, మార్చి 28:
ముమ్మరంగా దరఖాస్తుల పరిశీలన..
హైదరాబాద్ నగరంలోనే అత్యధిక సంఖ్యలో షేక్పేట మండలంలో క్రమబద్ధీకరణ దరఖాస్తులు రాగా రెండో స్థానంలో ఖైరతాబాద్ మండలం నిలుస్తోంది. పెద్ద ఎత్తున వస్తున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ తదితరులు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. ఒక్కో మండలంలో రెండు బృందాల ద్వారా ఇంటింటికెళ్లి దరఖాస్తులో పేర్కొన్న వివరాలు సరిగా ఉన్నాయా లేవా అని పరిశీలిస్తున్నారు. దరఖాస్తుదారుడు ఆక్రమించిన స్థలం వివరాలు, ఆ స్థలంలో ఎన్ని గజాల్లో ఇంటి నిర్మాణం ఉంది, 2014కంటే ముందు నుంచే అక్కడ ఉంటున్నారా తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. ఆర్డీవో, తహసీల్దార్ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ ప్రతిపాదనలు సిద్ధం చేసి సీసీఎల్ఏ ఆమోదం కోసం పంపిస్తారు. క్రమబద్ధీక రణకు మరో మూడురోజులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండడంతో మీ సేవా కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది.