హయత్నగర్ : విద్యార్థులు, యువతీ యువకులు మొబైల్ యాప్ ద్వారా ఆధార్ కార్డు నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకుని కోవిడ్ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కోరారు. గురువారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి కృషి మేరకు హయత్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు వ్యాక్సిన్ సెంటర్ను ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి హాజరై మాట్లాడుతూ జిహెచ్ఎంసి పరిధిలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 15 నుండి 18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపడుతుందని తెలిపారు.
రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సహకారంతో నియోజకవర్గంలోని దాదాపు 60 వేల మంది ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు కోవిడ్ టీకాలు వేయించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా వైద్య సేవలందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
కొవిడ్ టీకాలు వేయించుకునేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని మానసికంగా సన్నద్ధం చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. వైద్యులు టీకాలు ఇస్తున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల సిబ్బంది సహకారంతో సత్వరంగా విద్యార్థులకు టీకాలు వేయిస్తున్నామని వెల్లడించారు.
ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ తప్పకుండా మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు మాస్కులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో హయత్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, డీఎంహెచ్ఓ నాగజ్యోతి, శ్వేత, మాజీ కార్పొరేటర్లు సామ తిరుమలరెడ్డి, కొప్పుల విఠల్రెడ్డి, టీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.