హైదరాబాద్/కాచిగూడ, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం బీసీ గణన చేపట్టకుంటే బీజేపీకి తగిన శాస్తి తప్పదని బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు. బీసీల లెక తేల్చాలని దేశవ్యాప్తంగా ఉన్న 75 కోట్ల మంది బీసీలు డిమాండ్ చేస్తుంటే, బీజేపీ పెద్దలు మాత్రం బీసీల్లో 27 మందికి మంత్రి పదవులు ఇచ్చామని చెప్పుకొంటున్నారని మండిపడ్డారు.
బీసీ గణన చేపట్టాలన్న డిమాండ్తో బీసీ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో భారీ ప్రదర్శన, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని విజ్ఞప్తి చేశారు. రూ.2 లక్షల కోట్ల బడ్జెట్తో బీసీ సబ్ప్లాన్ను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు.
బీసీలకు రావాల్సిన రాజ్యాంగపరమైన హక్కులను కల్పించకుండా మోదీ ప్రభుత్వం అణిచివేస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీలు బీద మస్తాన్రావు, మార్గని భరత్, మాజీ ఎంపీ వీ హనుమంతరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్యాదవ్, జాజుల శ్రీనివాస్గౌడ్, కనకాల శ్యామ్, గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.