మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
ఖైరతాబాద్, మే 25 : ఏపీలోని కోనసీమలో దళిత ప్రజా ప్రతినిధుల ఇండ్లపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య డిమాండ్ చేశారు. బుధవారం బంజారాహిల్స్లోని మాల మహానాడు జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కోనసీమకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయడాన్ని జీర్ణించుకోలేని అగ్రవర్ణాల వారు మంత్రి విశ్వరూప్ ఇంటితో పాటు అనేక మంది ప్రజాప్రతినిధుల ఇండ్లపై దాడి చేసి విధ్వంసం సృష్టించారని, ఇది సరియైన పద్ధతి కాదన్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నదని మండిపడ్డారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు జంగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బంగి ఆనందరావు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బైండ్ల శ్రీనివాస్, భగవాన్ దాస్, తదితరులు పాల్గొన్నారు.