సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): బెంగళూరు కేంద్రంగా నగరంలో డ్రగ్స్ దందా నడుపుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ విక్రయదారులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.3 లక్షల విలువజేసే 30 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సుధీర్బాబు కేసు వివరాలను వెల్లడించారు.
రాజమండ్రికి చెందిన వీరం నాగేశ్వర్ ఉపాధి కోసం నగరానికి వలసొచ్చి, కూకట్పల్లిలో ‘షేక్స్ ఎన్ ైస్లెస్’లో వర్కర్గా పనిచేస్తున్నాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన కె.జితేందర్ ఉపాధి కోసం నగరానికి వలసొచ్చి, ఫిల్మ్నగర్లో నివాసముంటూ డబ్బింగ్ సౌండ్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ డ్రగ్స్కు అలవాటు పడ్డారు.
నాగేశ్వర్కు బెంగళూరులో ఉంటున్న నైజీరియా దేశానికి చెందిన డ్రగ్స్ వ్యాపారితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి నైజీరియన్ వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్ను కొనుగోలు చేసి, నగరంలో రూ.8 వేల నుంచి 10 వేలకు గ్రాము చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
నాలుగు రోజుల కిందట ఇద్దరు నిందితులు కలిసి ప్రైవేటు బస్సులో బెంగళూరు వెళ్లారు. అక్కడ నైజీరియన్ వద్ద నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసి, నగరానికి తిరిగి వచ్చారు. గురువారం సాయంత్రం వనస్థలిపురంలోని ఆటోనగర్లో డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తుండగా.. విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు వనస్థలిపురం పోలీసులతో కలిసి నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేసి, సొత్తును స్వాధీనం చేసుకున్నారు.