ఎల్బీనగర్, ఆగస్టు 1: ఎల్బీనగర్ నియోజకవర్గంలో సమగ్ర నాలా అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముంపు ముప్పునకు శాశ్వత పరిష్కారం కోసం రూ.103.25కోట్లతో చేపట్టిన ఈ పనులను గత మార్చిలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. గత వానకాలంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన ఈ పనులు తుది దశకు చేరుకున్నాయి. జూలై 31వ తేదీ లక్ష్యంగా చేసుకుని రెండు మూడు బాక్స్ డ్రైన్ పనులను పూర్తి చేసి.. ప్రారంభించాలన్న లక్ష్యంతో జీహెచ్ఎంసీ, ఎస్ఎన్డీపీ అధికారులు ముందుకెళ్తున్నారు.
తుది దశకు పనులు..
బండ్లగూడ చెరువు నుంచి నాగోలు చెరువు వరకు రూ.7.26 కోట్లతో 910 మీటర్ల పనులు, బండ్లగూడ చెరువు నుంచి మూసీ నది వరకు రూ. 30.08 కోట్లతో 1260 మీటర్ల పనులు పూర్తి కావస్తున్నాయి. త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా మన్సూరాబాద్ చెరువు నుంచి బండ్లగూడ చెరువు వరకు రూ.6.69కోట్లతో 1880 మీటర్లు, హయత్నగర్ బాతుల చెరువు నుంచి ఇంజాపూర్ నాలా వరకు రూ.9.65 కోట్లతో 1080 మీటర్లు బాక్స్ డ్రైన్, కర్మన్ఘాట్ చంద్రా గార్డెన్స్ నుంచి సరూర్నగర్ చెరువు వరకు 1320 మీటర్లు, కర్మన్ఘాట వంగ శంకరమ్మ గార్డెన్స్ నుంచి సరూర్నగర్ చెరువు వరకు 1570 మీటర్లు రెండు కలిపి రూ.28.10కోట్ల వ్యయంతో బాక్స్ డ్రైన్, సరూర్నగర్ చెరువు నుంచి చైతన్యపురి నాలా వరకు 2820 మీటర్లు, సరూర్నగర్ చెరువు నుంచి కొదండరాంనగర్ మీదుగా చైతన్యపురి నాలా వరకు రెండు పనులు కలిసి రూ.21.47 కోట్లతో చేపడుతున్న పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి.
వేగంగా పనులు చేపట్టేలా..
అన్ని పనులను వేగంగా చేపట్టేలా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డితో పాటు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడంతో పాటు పనులను పరిశీలిస్తూ ముందుకు వెళ్తున్నారు. వీరికి తోడుగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి కూడా పనులను పరిశీలించి వేగంగా పనులు చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
దాదాపు పూర్తి కావస్తున్నాయి..
ఎల్బీనగర్ నియోజకవర్గంలో వరదనీటి ముంపు సమస్యలు లేకుండా నిర్మిస్తున్న వరదనీటి నాలా బాక్స్ డ్రైన్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. తుది దశలో ఉన్న పనులను పూర్తి చేసి త్వరలోనే ప్రారంభిస్తాం. అలాగే, మిగిలిన బాక్స్ డ్రైన్ పనులపై కూడా పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో ఉన్న వరద కాలువల నిర్మాణం జరిగితే ముంపు సమస్యలకు శాశ్వతంగా చెక్ పడినట్లు అవుతుంది.
– పంకజ , ఎల్బీనగర్ జోనల్ కమిషనర్