మేడ్చల్, డిసెంబర్17(నమస్తే తెలంగాణ) : దళితుల అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వేయంగా పెట్టుకున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో శనివారం మేడిపల్లి దళిత రైతులకు మంత్రి మల్లారెడ్డి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా దళిత రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరించి న్యాయం చేసినట్లు పేర్కొన్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని 62 సర్వేనెంబర్లో 116 ఎకరాలలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హెచ్ఎండీఏ ద్వారా ల్యాండ్ పూలింగ్ చేయించి డెవలప్మెంట్ అనంతరం ఎకరాకు 5 వందల గజాల భూమి ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 32మంది దళిత రైతులకు ఈసందర్భంగా పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, కీసర ఆర్డీవో రవి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు.