శామీర్పేట, అక్టోబర్ ౧౩: రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీకే ఓటు అడిగే హక్కు ఉందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సభ సందర్భంగా శామీర్పేట మండలం అలియాబాద్లోని సీఎంఆర్ కన్వెన్షన్లో శుక్రవారం ఉమ్మడి శామీర్పేట మండలం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కార్యకర్తలు కంకణబద్ధులై పని చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దేశం గర్వించే స్థాయిలో పథకాలను ప్రజలకు అందిస్తున్నదన్నారు.
దళితులను ధనవంతులుగా మార్చేందుకు దళితబంధు పథకాన్ని తీసుకువచ్చి దశల వారీగా అందజేస్తున్నామని తెలిపారు. గొల్లకురుమలకు గొర్రెలు, మత్స్యకారులకు చేప పిల్లలు, బీసీలకు బీసీబంధుతో ఆత్మబంధువుగా నిలుస్తున్నాడని కొనియాడారు. మారుమూల ప్రాంతమైన మూడుచింతలపల్లిని మండలంగా ఏర్పాటు చేసి అభివృద్ధికి రూ.౬౯ కోట్లు కేటాయించిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎండి.జహంగీర్, నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి, మండలాల అధ్యక్షులు సుదర్శన్, మల్లేశ్గౌడ్, నోముల శ్రీనివాస్రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ రాజేశ్వర్రావు, ఎంపీపీలు ఎల్లూబాయిబాబు, హారికామురళిగౌడ్, జడ్పీటీసీ అనితలాలయ్య, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్యయాదవ్, వైస్ ఎంపీపీ సుజాత తిరుపతిరెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు జహీరుద్దీన్, ప్రధాన కార్యదర్శులు సతీష్రెడ్డి, అనిల్రెడ్డి, ప్రచార కార్యదర్శి ప్రభాకర్, మాజీ ఎంపీపీలు సీతారాములుగౌడ్, యాదగిరి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు, ఏఎంసీ డైరెక్టర్లు, కో ఆఫ్షన్ సభ్యులు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అంటేనే మోసం, స్కాం అనే విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమి లేదని… దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజల సమస్యను ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఈ ప్రాంతం ౩౦ ఏండ్ల నుంచి ఏవిధంగా ఉండే.. బీఆర్ఎస్ హయాంలో ఏ విధంగా ఉంది అనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.
కన్నీటి కష్టాలకు స్వస్తి చెప్పి ప్రజలకు సంతోషాన్ని ఇచ్చింది కేసీఆర్ మాత్రమేనన్నారు. కాంగ్రెస్ హయాంలో నీళ్లు, కరెంటు ఉండేవి కావని… కనీసం రైతులు పండించిన పంటకు మద్దతు ధర లేదన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న పీసీసీ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఈ స్థానం నుంచి గెలిచి ప్రజల్లోకి ఒక్కరోజైనా వచ్చాడా? అని ప్రశ్నించారు. ఇలాంటి పార్టీలు, నేతలను నమ్ముకుంటే ప్రజలకు ఏమీ చేయరని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.