నగరవ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు
ఓవైపు ధాన్యం కొనుగోళ్లపై సమరభేరి
నేడు ప్రధానికి తీర్మానాల ప్రతులు
మరోవైపు సార్వత్రిక సమ్మె
స్తంభించిన బ్యాంకు, బీమా, తపాలా, టెలికాం సేవలు
మోదీకి వ్యతిరేకంగా హోరెత్తిన ఆందోళనలు
ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష, ఇతర కార్మిక, ప్రజాసంఘాల పిలుపుతో నగరంలో సార్వత్రిక సమ్మె తొలిరోజు విజయవంతమైంది. బ్యాంకులు, బీమా, తపాలా, టెలికాం, భవిష్యనిధి ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. నారాయణగూడ చౌరస్తా నుంచి కాచిగూడ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.
‘మోదీ డౌన్.. డౌన్. కేంద్ర ప్రభుత్వం దిగిరావాల్సిందే’ అన్న నినాదాలతో నగరం మొత్తం హోరెత్తింది. ఓవైపు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లపై తీర్మానాలు చేస్తే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సార్వత్రిక సమ్మె తొలిరోజు విజయవంతమైంది.
‘రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి. కొనేదాకా వెంటాడుతాం. ప్రధాని మోదీ రైతు వ్యతిరేకి. కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ అన్నదాతలను ఆగం చేస్తున్నారు.’ అని ప్రజా, రైతు సంఘాలు ధ్వజమెత్తాయి. ధాన్యం కొనుగోలు చేయాలంటూ మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పంచాయతీలు, మండల పరిషత్, పురపాలక వర్గాలు
తీర్మానాలు చేశాయి. వీటిని మంగళవారం ప్రధానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సార్వత్రిక సమ్మె సక్సెస్
తొలి రోజు ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు
సిటీబ్యూరో, మార్చి 28 : కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నగరంలోని పలు పార్టీలు, కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాల నాయకులు సమ్మెకు మద్దతుగా కదిలారు. సోమవారం నగరంలోని పలు కూడళ్లలో బ్యాంకు, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, తపాలా శాఖతో పాటు పలు కార్మిక, ఉద్యోగ, రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు ప్రదర్శనలు, సమావేశాలు నిర్వహించారు. ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. దీంతో అన్ని కార్యాలయాల్లో సేవలు స్తంభించిపోయాయి. కోఠిలోని బ్యాంక్ స్ట్రీట్లో అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు మాట్లాడుతూ ఎన్పీఏ వసూలు చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు బ్యాంకులను ప్రభుత్వ రంగంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన
మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 28 : కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సమాఖ్య వైస్ చైర్మన్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్ పిలుపు మేరకు మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రవిప్రకాశ్, కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, సంఘం నాయకులు ఈశ్వర్, జేమ్స్, గిరికాంత్, సత్యం, సంజయ్, అనిత, హరి, శశికాంత్ రెడ్డి, రాంచందర్, శ్రీదేవి, పద్మ,శేషుపద్మ, సునీత పాల్గొన్నారు.
కేంద్రంపై దశలవారీగా పోరాటాలు
హిమాయత్నగర్,మార్చి28: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దశలవారీగా పోరాటాలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి డీజీ నరసింహరావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. సార్వత్రిక సమ్మెల్లో భాగంగా సోమవారం నారాయణగూడ నుంచి కాచిగూడ వరకు వామపక్ష పార్టీల నాయకులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు, ప్రజల బతుకులను చిన్నాభిన్నం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. ప్రజా నాట్యమండలి ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ నేతృత్వంలో కళాకారులు నృత్యాలు చేస్తూ పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి నరసింహ, నాయకులు ఎన్.శ్రీకాంత్, సృజన, ఛాయాదేవి, శ్రీమాన్, పశ్యపద్మ, న్యూడెమోక్రసీ నాయకులు చలపతిరావు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికవర్గం జోలికొస్తే ఖబర్దార్
దేశ ప్రయోజనాల కోసమే సమ్మె
సిటీబ్యూరో, మార్చి 28 : దేశ ప్రయోజనాల కోసమే సమ్మె నిర్వహిస్తున్నట్లు ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పూర్వపు ప్రధాన కార్యదర్శి (ఏఐఐఈఐ) కే.వేణుగోపాల్ అన్నారు. సోమవారం ఎల్ఐసీ హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో పరిధిలోని 44 బ్రాంచిల నుంచి ఉద్యోగులు, సిబ్బంది, ఎల్ఐసీ ఏజెంట్లు ఆయా కార్యాలయాల నుంచి డివిజనల్ ఆఫీసుల వరకు ర్యాలీలు నిర్వహించారు. అనంతరం డివిజన్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో యూనియన్ నేతలు ప్రసంగించారు. ఈ సందర్భంగా కే.వేణుగోపాల్, సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి టీవీఎస్ఎన్ రవీంద్రనాథ్, సీఐటీయూ కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని కేరళ, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ర్టాలు అసెంబ్లీ తీర్మానాలు చేసినా కేంద్రానికి చీమకుట్టినైట్టెనా లేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా కార్మికులకు మద్దతు పలికారని గుర్తు చేశారు. ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదాకా రైతు ఉద్యమ స్ఫూర్తితో పోరాడతామని పేర్కొన్నారు. సమావేశ ప్రాంగణాలు కార్మికవర్గం జోలికొస్తే ఖబర్దార్, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలి అనే నినాదాలతో మార్మోగాయి. ఈ కార్యక్రమంలో మహిళా సబ్కమిటీ కన్వీనర్ సుజాత, యూటీఎఫ్ నాయకురాలు శారద, ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి సూర్యం, బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి వెంకట రామయ్య, ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ కార్యదర్శి వి.రమేశ్గౌడ్ తదితరులు హాజరై ప్రసంగించారు.