అధికారులు కబ్జాలపై ఉక్కుపాదం మోపారు. భారీ పోలీసు బలగాలతో అధికారులు కుర్మల్గూడ సర్కారు భూమిలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ‘నమస్తే తెలంగాణ’ గత నెల 27న ‘కబ్జా కాండ… సామాన్యుడిపై బండ’ శీర్షికన కథనం ప్రచురించింది. ఈ కబ్జా కాండను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్
సీరియస్గా తీసుకోవడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా కదిలింది. ముఖ్యంగా పోలీసు శాఖ సంపూర్ణ సహకారాన్ని అందించడంతో పక్కా ప్రణాళికతో కుర్మల్గూడలోని అక్రమ నిర్మాణాలు నేలమట్టమయ్యాయి.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్ బాలాపూర్ మండలం కుర్మల్గూడ గ్రామ పరిధిలోని 46 సర్వే నంబర్లో సుమారు 36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొన్ని దశాబ్దాల కిందట ఏడెనిమిది ఎకరాల్లో నిరుపేదలకు ఇందిరమ్మ పట్టాలు పంపిణీ చేశారు. మిగిలిన వాటిలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హెచ్ఎండీఏ 16.30 ఎకరాల్లో అధికారికంగా లే అవుట్ చేశారు. 2022లో లే అవుట్ చేసి… 2023లో ఈ-వేలం ద్వారా అనేక ప్లాట్లను విక్రయించగా.. గరిష్ఠంగా చదరపు గజం రూ.33వేల ధర పలికింది.
ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న దాదాపు 12-13 ఎకరాల భూములపై అక్రమార్కుల కన్నుపడింది. గ్రామపంచాయతీ అనుమతి ఇచ్చినట్లు పాత పత్రాలు సృష్టించి.. కరెంటు మీటరు, ఇంటి నంబర్లతో కబ్జా కాండను సాగించారు. ముఖ్యంగా కొందరు అక్రమార్కులు తక్కువ ధరకు వస్తుందంటూ సామాన్యుల దగ్గర లక్షల రూపాయలు దండుకున్నారు. ఈ క్రమంలో ‘నమస్తే తెలంగాణ’లో కథనం వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అధికార యంత్రాంగం కూల్చివేతలకు రంగం సిద్ధం చేసింది.
కూల్చివేతల సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయని అధికార యంత్రాంగం భావించింది. డీసీపీ సునీతారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పక్కా ప్రణాళిక రూపొందించారు. ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 85 మంది పోలీసు బలగాలు… బడంగ్పేట కమిషనర్ సుమన్రావు ఆధ్వర్యంలో దాదాపు 40 మంది మున్సిపల్ సిబ్బంది.. బాలాపూర్ తహసీల్దార్ మాధవీరెడ్డి ఆధ్వర్యంలో మొత్తం 14 ఇంటి నిర్మాణాలు, ఎనిమిది బేస్మెంట్లు, ప్రహరీ నిర్మాణాలు, మరికొన్ని పాకలను కూల్చివేశారు. కాగా, కూల్చివేతల సందర్భంగా అధికారుల దృష్టికి మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
అక్కడ యధేచ్ఛగా అక్రమ మైనింగ్ నిర్వహించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే కూల్చివేతల సమయంలో ఇండ్లు నిర్మించుకున్న పలువురు తాము మోసపోయామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. భారీ ఎత్తున కూల్చివేతలు జరగడంతో సుమారు రూ.150 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఇప్పుడు సురక్షితంగా ఉంది. ఈ భూమిని ఏం చేయాలనే దానిపై జిల్లా కలెక్టర్తో మాట్లాడి, నిర్ణయిస్తామని ఆర్డీవో సూరజ్కుమార్ తెలిపారు.