కేపీహెచ్బీ కాలనీ, జనవరి 29 : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో కూకట్పల్లి నియోజకవర్గం ఆదర్శవంతంగా అభివృద్ధిని సాధించిందని పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎనిమిదేండ్ల కాలంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో నియోజకవర్గంలో తాగునీరు, విద్యుత్, ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడేవారని సీఎం కేసీఆర్ పాలనలో నగరంలో తాగునీటి కష్టాలు తీరడంతో పాటు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందిస్తున్నారన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఫ్లైఓవర్, అండర్పాస్ బ్రిడ్జిలను నిర్మించడంతో పాటు రోడ్లను విస్తరించినట్లు తెలిపారు.
అలాగే కాలనీలు, బస్తీలలో నిరుపయోగంగా ఖాళీ స్థలాలను పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా తీర్చిదిద్దడం జరిగిందని.. చెరువులను సుందరీకరించే దిశగా ఎస్టీపీలను ఏర్పాటు చేస్తూ ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. కాలనీలు, బస్తీలలో అంతర్గత రోడ్లన్నింటినీ బాగుచేస్తూ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, సీఎం రిలీఫ్ ఫండ్తో పేదలందరికీ కష్టకాలంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. కార్పొరేటర్లతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాలనీలు, బస్తీలలో ప్రజలను కలుస్తూ ఎనిమిదేండ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని వివరించాలని.. పేదలందరికీ సంక్షేమ ఫలాలను అందించేలా కృషి చేయాలన్నారు.
నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలన్నారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించే సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లేలా సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, పగుడాల శిరీషాబాబురావు, ముద్దం నర్సింహ యాదవ్, ఆవుల రవీందర్ రెడ్డి, సబీహాబేగం, పండాల సతీశ్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్కుమార్, పగుడాల బాబురావు, ఆయా డివిజన్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ఉన్నారు.