సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను చూసేందుకు మంగళవారం వివిధ జిల్లాలకు చెందిన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు. తమ అభిమాన నేతను తమకు చూపించాలంటూ డిమాండ్ చేశారు.
పోలీసులు ఎంత వారించినా వినిపించుకోకుండా దవాఖాన ముందు బైఠాయించి నినాదాలు చేశారు. కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారని, త్వరలోనే అందరినీ కలుస్తారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నచ్చచెప్పడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. అదే విధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రముఖులు కేసీఆర్ను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.