హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతున్నది. హైదరాబాద్ పరిధిలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గాల్లో తిరుగులేని విజయం సాధించిన బీఆర్ఎస్.. మరోసారి సిటీపై తన పట్టును నిలుపుకోవాలని చూస్తున్నది. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రచార కార్యరంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం వరకు సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల పరిధిలో రోడ్షోలు నిర్వహించనున్నారు.
ఈ క్రమంలో తొలుత మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో రోడ్షోలు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని శ్రీరామ్నగర్లో ప్రచారం చేస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు కూకట్పల్లి నియోజకవర్గానికి చేరుకుంటారు. మూసాపేట్లోని చిత్తారమ్మ ఆలయం వద్ద పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరనున్నారు.
ఇక ఈ నెల 3న సికింద్రాబాద్, సనత్నగర్, నాంపల్లి, 4న కుత్బుల్లాపూర్, మేడ్చల్, కంటోన్మెంట్, మల్కాజిగిరి, 5న ఎల్బీనగర్, ఉప్పల్, ముషీరాబాద్, 6న శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, 7న ఖైరతాబాద్, అంబర్పేటలో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు.