KTR Road Show | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యూసుఫ్గూడ డివిజన్లో జరగాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో వాయిదా పడింది. భారీ వర్షం నేపథ్యంలో ఈ రోడ్ షో వాయిదా పడినట్లు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కేటీఆర్ వెల్లడించారు.
ఇంతటి వర్షంలో కూడా రోడ్ షో కోసం పెద్ద ఎత్తున తరలివచ్చిన స్థానిక ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని పేర్కొన్నారు. అంతకుముందు తెలంగాణ భవన్లో మాజీ కార్పొరేటర్, బీజేపీ నేత నవతా రెడ్డి ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్లో చేరారు. ఆమెకు కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు వరుసగా జరుగుతున్న చేరికలతో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మెసేజ్ వెళ్తోందని ఆయన స్పష్టం చేశారు. మరో 500 రోజుల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ను మళ్లీ తెచ్చుకొని రాష్ట్రాన్ని బాగుచేసుకుందామని చెప్పారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలంటే జూబ్లీహిల్స్లో ఆ పార్టీని ఓడించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గోపీనాథ్ను తలుచుకొని మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకుంటే.. దాన్ని కూడా డ్రామా అంటూ కాంగ్రెస్ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్కు మహిళలు తగిన గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.