రంగారెడ్డి, డిసెంబరు 25(నమస్తే తెలంగాణ): చేవెళ్ల పార్లమెంట్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. సోమవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని, చేవెళ్ల పార్లమెంట్ స్థానం గెలుపే లక్ష్యంగా నేతలు పనిచేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరెకపూడి గాంధీ, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్ రెడ్డి, మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.