సిటీబ్యూరో, సెప్టెంబరు 16 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘన విజయం సాధిస్తుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రానున్న ఉప ఎన్నికల్లో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేసి జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ విజయయాత్రను తిరిగి ప్రారంభించాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలతో కలిసి మంగళవారం కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ను తెలంగాణ ఆర్థిక ఇంజిన్గా మార్చిన మిగతాగత పదేళ్ల తమ ప్రభుత్వ పాలనకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు నగరాన్ని పూర్తిగా కుప్పకూల్చేలా ఉన్నాయని ఈ విషయాన్ని నగర ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాల్సిందేనని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్రెడ్డి సృష్టించిన భయం కారణంగా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, అన్ని రంగాలపైన కాంగ్రెస్ అసమర్థ విధానాల ప్రతికూల ప్రభావం తీవ్రంగా ఉందని కేటీఆర్ గుర్తు చేశారు.
సమాజంలోని అన్ని వర్గాలు కాంగ్రెస్ అసమర్ధ విధానాల వల్ల నష్టపోయాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, రాగిడి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్ , కేపీ వివేక్, మాధవరం కృష్ణారావు, సుధీర్రెడ్డి, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు సలీం, రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రమణ, శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్, సీనియర్ నేతలు రావుల చంద్రశేఖర్, ధాస్యం వినయ్భాస్కర్, భాస్కర్రావు, ముఠా జయసింహ తదితరులు పాల్గొన్నారు.