కేపీహెచ్బీ కాలనీ, మే 30 : వర్షంనీటి ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత తెలిపారు. మంగళవారం జోన్ కార్యాలయంలో ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్సీ మమత మాట్లాడుతూ.. రానున్న వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తే ప్రాంతాలను గుర్తించా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. చెరువులు, కుంటల పరిసర ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీలలో ముంపు సమస్యలు రాకుండా ప్రతిరోజూ చెరువును గమనించాలని కోరారు. గతేడాది భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాలలో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రధానమైన చెరువులలో ప్రతిరోజూ నీటి మట్టాన్ని గుర్తించాలని, బఫర్జోన్లో, ఎఫ్టీఎల్ పరిధిలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువులో నీటి మట్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు సామర్థ్యం మేరకు నీటిని నిల్వ ఉంచేలా చూడాలన్నారు. చెరువులోకి వచ్చే నీరుఎంత.. చెరువు నుంచి బయటికి వెళ్తున్న నీరు ఎంత అనేది ఎప్పటికప్పుడు పరిశీలించాలని, సామర్థ్యానికి మించి నీటి ప్రవాహనం చెరువులోకి వచ్చినట్లయితే వెంటనే ఆ నీటిని బయటికి పంపించేలా చూడాలన్నారు. చెరువు మత్తడిల వద్ద చెత్తాచెదారం, వ్యర్థాలు పోగుకాకుండా చూడాలని.. నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ముంపు సమస్యలు తలెత్తకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఇరిగేషన్ నార్త్ ట్యాంక్ ఈఈ నారాయణరావు, ఏఈ విశ్వం, కూకట్పల్లి సర్కిల్ ఉప కమిషనర్ పి.రవీందర్కుమార్, జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్, ఎంటమాలజీ విభాగాధికారులు, సిబ్బంది
పాల్గొన్నారు.