బంజారాహిల్స్, డిసెంబర్ 8 : అబద్ధపు ప్రచారాలతో పాటు తప్పుడు ఆరోపణలను నమ్మి నిరంతరం తెలంగాణ అభివృద్ధితో పాటు పేదల సంక్షేమం గురించి ఆలోచించే కేసీఆర్ను అధికారానికి దూరం చేయడం బాధాకరమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్, జవహర్కాలనీలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఆయన గెలుపుకోసం కృషిచేసిన కార్యకర్తలను అభినందించారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేశారని, వారందరికీ అండగా నిలుస్తానన్నారు. తన రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి నేతను ఇప్పటిదాకా చూడలేదని, నిరంతరం పేదల కోసం తాపత్రయపడే కేసీఆర్ ప్రమాదంలో గాయపడడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
త్వరలోనే కేసీఆర్ కోలుకుని ప్రజల కోసం పనిచేస్తారని చెప్పారు. అధికారంలో లేకున్నా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలను పరిష్కరించడంతోపాటు శాసనసభలో గళమెత్తుతానని పేర్కొన్నారు. తాను పార్టీ మారుతానంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారి మాటలు నమ్మవద్దని సూచించారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎలాంటి పాలన అందిస్తుందో ఆరునెలల పాటు వేచి చూద్దామని, ఎంతో కష్టపడిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరునెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్, బీఆర్ఎస్ నేతలు బోజిరెడ్డి, స్వామి గౌడ్, మంగళారపు లక్ష్మణ్, సునీల్, శంకర్, కిరణ్ యాదవ్, రుద్రముణి, భరత్, దీపాదేవి, జ్యోతి, చంద్రకళ, వాణి, తదితరులు పాల్గొన్నారు.