కేపీహెచ్బీ కాలనీ, జనవరి 11 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు పరీక్షల ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ, రెవెన్యూ, వైద్యఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజా ఆరోగ్యం దృష్ట్యా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న పేదలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. మొదటి విడత కంటి వెలుగుకు మంచి స్పందన లభించిందని.. రెండో విడత కంటి వెలుగు పరీక్షల కోసం ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. జీహెచ్ఎంసీ వార్డుల వారీగా కంటి వెలుగు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు అదనంగా పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు.
ఈనెల 18 నుంచి ఎంపిక చేసిన కేంద్రాలలో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కండ్ల అద్దాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీసీలు రవికుమార్, రవీందర్కుమార్, తాసీల్దార్ గోవర్ధన్, డాక్టర్ చందర్, జీహెచ్ఎంసీ యంత్రాంగం, కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్రావు, జూపల్లి సత్యనారాయణ, పండాల సతీశ్ గౌడ్, పగుడాల శిరీషాబాబురావు, ముద్దం నర్సింహ యాదవ్, మాజీ కార్పొరేటర్ శ్రవణ్కుమార్ తదితరులున్నారు.