కండ్లకోయ గేట్వే ఐటీ పార్క్ నిర్మాణానికి టెండర్లు
ఈనెల 27 కల్లా ప్రక్రియ పూర్తి
10 ఎకరాల్లో 22 లక్షల ఎస్ఎఫ్టీ.. రూ. 998 కోట్లతో నిర్మాణం
మూడేండ్లలో పూర్తి చేసే లక్ష్యం
మేడ్చల్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కండ్లకోయ గేట్వే ఐటీ పార్క్ నిర్మాణానికి టెండర్ పక్రియ ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీన టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఐటీ పార్క్ నిర్మాణ పనులను కాంట్రాక్టర్కు అప్పగించనున్నారు. 125 సర్వే నెంబర్లోని 10 ఎకరాల 12 గుంటల విస్తీర్ణంలో టెండర్ పక్రియ పూర్తయిన 36 నెలల్లో పనులు పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించారు. 22 లక్షల ఎస్ఎఫ్టీతో రూ. 998 కోట్లతో ఐటీ పార్క్ను నిర్మించనున్నారు. 11 లక్షల ఎస్ఎఫ్టీ ఐటీ కంపెనీలకు కేటాయించగా మరో 11 లక్షల ఎస్ఎఫ్టీ కమర్షియల్కు కేటాయించే విధంగా టీఎస్ఐఐసీ అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
ఐటీ కంపెనీల రిజిస్ట్రేషన్లు..
హైదరాబాద్ నగరానికి ఉత్తరాన ఏర్పాటు చేస్తున్న ఐటీ పార్క్లో ఇప్పటి వరకు వందకుపైగా కంపెనీల ఏర్పాటుకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. యూరప్, యూకే, యూఎస్ దేశాల నుంచే కాకుండా వివిధ రాష్ర్టాలకు చెందిన కంపెనీల యజమానులు దరఖాస్తులు చేసుకోనుండటంతో ఎస్ఎఫ్టీని పెంచేలా ప్రభుత్వం యోచిస్తున్నది. ఐటీ పార్క్లో కంపెనీల ఏర్పాటుకు చాలా దరఖాస్తులు వస్తున్నట్లు కొంపల్లి ఐటీ ఆంత్రప్రెన్యూర్ అసోసియేషన్ (కైటీయా) ప్రతినిధుల అధ్యక్షుడు ఓరుగంటి వెంకట్ తెలిపారు.
మేడ్చల్ మరింత అభివృద్ధి
ఐటీ పార్క్ మొదట 6 లక్షల ఎస్ఎఫ్టీ అనుకున్నప్పటికీ వస్తున్న డిమాండ్ మేరకు 22లక్షల ఎస్ఎఫ్టీని పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో కండ్లకోయలో ఐటీ పార్క్ ఏర్పాటుతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మరింత అభివృద్ధి సాధిస్తుంది. టెండర్ పూర్తయిన 36 నెలల్లో పనుల పూర్తికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. గేట్వే ఐటీ పార్క్లు కంపెనీల ఏర్పాటుకు అనేక మంది యజమానులు ముందుకు వస్తున్నారు.
– మంత్రి చామకూర మల్లారెడ్డి