ఎర్రగడ్డ, సెప్టెంబర్ 1: టీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాత విద్యాశాఖలో సమూల మార్పులు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే మాగం టి గోపీనాథ్ అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవటమే కాకుండా విద్యార్థులకు మెరుగైన వసతులను కల్పించటం జరిగిందని పేర్కొన్నారు. బోరబండలోని ప్రభుత్వ బాలుర గురకుల పాఠశాలలో గోపీనాథ్ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించి అక్కడి వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం గురుకుల పాఠశాలల నిర్వహణకు కోట్లాది రూపాయలను కేటాయించటం జరిగిందన్నారు.
చక్కటి భవనాలు, ఆహ్లాదకర వాతావరణం, నాణ్యమైన విద్య గురకుల పాఠశాలల సొంతమని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు, సిబ్బందితో కలిసి గురకుల పాఠశాలలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఏవైనా చిన్న చిన్న సమస్యలుంటే తన దృష్టికి తేవాలని ఎమ్మెల్యే పేర్కొనగా పలువురు విద్యార్థులు ముందుకు వచ్చి అక్క డి పరిస్థితిని గురించి వివరించారు. తన దృష్టికి వచ్చిన సమస్యల గురించి సంబంధిత అధికారితో మాట్లాడి వెంటనే పరిష్కారం అయ్యే విధంగా సహకరిస్తానని గోపీనాథ్ హామీ ఇచ్చారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతుల ఏర్పాటు ఆవశ్యకమని అన్నారు. అదే విధంగా భోజనం విషయంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. వంటశాలలోని సన్న బియ్యం, కూరగాయలు, ఇతర సామగ్రిని పరిశీలించిన ఆయన వాటి నాణ్యత గురించి సంతృప్తిని వ్యక్తం చేశారు. వార్డెన్ డేనియల్, హరిప్రసాద్ టీఆర్ఎస్ నేతలు విజయకుమార్, కోఆర్డినేటర్ విజయసింహ, ఇన్ఛార్జి సయ్యద్ సిరాజ్, ఏడీ మధు, పద్మ, ధర్మ, యూసుఫ్, ప్రశాంత్, బాబూరావు, డేవిడ్ పాల్గొన్నారు.