హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): అనుమానం పెంచుకొని భార్యను చంపేశాడు. కరోనా పేరు చెప్పి తప్పించుకోవాలని చూశాడు. కానీ మృతురాలి తల్లికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఓ ఆటోడ్రైవర్ నిజస్వరూపం బట్టబయలైంది. ఈ ఘటన గత నెల 18న రాచకొండ పోలీస్ కమిషనరేట్ వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్నది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను శనివారం నేరేడ్మెట్లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్భగవత్ వెల్లడించారు. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం దుగ్యాలకు చెందిన రమావత్ విజయ్కుమార్, రమావత్ కవిత భార్యాభర్తలు. వీరు హైదరాబాద్లోని వనస్థలిపురం వైదేహీనగర్లో నివాసం ఉంటున్నారు. కవిత విపరీతంగా ఫోన్లు మాట్లాడుతుండటంతో విజయ్ భార్యపై అనుమానం పెంచుకొన్నాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. గత నెల 18న కవిత నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున 3 గం టల సమయంలో ఆమె ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి, గొంతు నులిమి చంపేశాడు. అత్తామామలకు ఫోన్ చేసి కవిత కరోనాతో చనిపోయిందని, ఊరికి తీసుకొస్తున్నానని చెప్పాడు. అక్కడ మృతదేహాన్ని ఎవర్నీ ముట్టుకోనివ్వలేదు. మొత్తానికి కవిత కరోనాతోనే చనిపోయిందని ఊరందర్ని నమ్మించి అంత్యక్రియలు చేశాడు. కవిత తల్లికి అనుమానం వచ్చి విజయ్కుమార్ చేయించిన కరోనా రిపోర్టును సంపాదించింది. అందులో నెగిటివ్ ఉందని తెలుసుకొని, తన కూతురిని విజయే హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించగా శ్వాససరిగా అందక చనిపోయిందని, మెడపై గాయాలున్నాయని ఫోరెన్సిక్ అధికారులు రిపోర్టు ఇచ్చారు. పోలీసులు విజయ్ను అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్టు ఒప్పుకొన్నాడు. కేసును దర్యాప్తు చేసిన వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, సిబ్బందిని సీపీ అభినందించారు.