మియాపూర్ , సెప్టెంబర్ 22 : బీఆర్ఎస్కు యువకుల సంపూర్ణ మద్దతు ఉన్నదని, గడిచిన రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. బీఆర్ఎస్తో కలిసి ముందుకు సాగేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని అందుకే పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని తెలిపారు. మాదాపూర్ డివిజన్కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 100 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే సాధ్యమని అన్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారని, ఎన్నికల ప్రకటన విడుదలయ్యేలోగా ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలు ఖాళీ కావటం తథ్యమన్నారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్ ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్రతిపక్ష పార్టీలను సైతం విశేషంగా ఆకర్షిస్తున్నాయని అన్నారు. ప్రతిపక్షాల మాటలపై ప్రజలకు ఏమాత్రం విశ్వాసం లేదని, బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహదేవ్, సాయి, కృష్ణ, అఫ్రోజ్, రాజు, వినయ్, వంశీ, అస్లాం, నరేందర్, ఉపేందర్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.