రవీంద్రభారతి, అక్టోబర్ 28: కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బీసీల ద్రోహి అని, కుల జనగణన పేరుతో మరోసారి బీసీలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పూనుకున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తుమన్నా హోంశాఖ మంత్రి అమిత్ షా సూర్యాపేటలో ప్రకటించినందుకు గాను ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించాలన్నారు. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్గాంధీకి దేశ రాజకీయాలపై అవగాహన లేదని, సామాజిక న్యాయంపై అవగాహన లేదన్నారు. ఉద్దంపూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు ఎమ్మెల్యే సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేతుల్లో బందీ అయినాడని ఆయన విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రంలో కా్రంగెస్ పార్టీ పూర్తిగా రెడ్ల పార్టీగా మిగిలిపోయిందని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బీసీలు బంగాళాఖాతంలో పాతిపెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 75 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రిని చేయలేదని, రాహుల్గాంధీ ఎన్నికల ముందు బీసీ బిల్లును పార్లమెంట్లో పెడుతామని మరోసారి బీసీలను మోసం చేయడానికి ముందుకు వస్తున్నాడని ఆయన దుయ్యబట్టారు. 60 శాతం ఉన్న బీసీలకు కేవలం 20 సీట్లు ఇచ్చి 5 శాతం ఉన్న రెడ్లకు 48 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం దారుణమన్నారు. రేవంత్రెడ్డిపై బీసీలు తిరగబడాలని ఎక్కడ బహిరంగ సభలు నిర్వహించిన బహిష్కరించాలని, బీసీలు ఆయన సభలకు వెళ్ళకూడాని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం జాతీయ అధ్యక్షుడు విక్రం గౌడ్, కుందాల గణేష్చారి, మహేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.