కవాడిగూడ/మారేడ్పల్లి/బేగంపేట్/బంజారాహి ల్స్,జూన్ 20: బంజారాహిల్స్ రోడ్ నం 12లోని జగన్నాథఆలయం వద్దమంగళవారం జగన్నాథ రథయాత్ర కన్నులపండువగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు అందుకున్న జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల ఉత్సవ మూర్తులను అర్చకులు రథం మీదకు చేర్చారు. ముందుగా సంప్రదాయబద్ధ్దంగా బంగారు చీపురుతో శుభ్రం చేసిన అనంతరం జై జగన్నాథ నినాదాల నడుమ రథయాత్ర ప్రారంభమైంది. నగరంలోని పలు ప్రాంతాలనుంచి వేల సంఖ్యలో వచ్చిన భక్తులు రథాన్ని లాగేందుకు పోటీలు పడ్డారు. మేళతాళాలతో పాటు సంప్రదాయ నృత్యాలు, భజనలతో బంజారాహిల్స్ రోడ్ నం 12 కోలాహలంగా మారింది. అశేషంగా వచ్చిన భక్తజనంతో ప్రధాన రహదారులు కిక్కిరిసిపోయాయి.
జగన్నాథ ఆలయం నుంచి విశ్వసాయి మందిరం దాకా రథయాత్ర కొనసాగింది.అలాగే సికింద్రాబాద్ జనరల్ బజార్లోని జగన్నాథ స్వామి ఆలయం నుంచి రాణిగంజ్, గాస్మండి, ఆర్పీ రోడ్డు మీదుగా జగన్నాథ స్వామి రథయాత్ర కొనసాగింది. అంతకు ముందు ఎంజీ రోడ్డులోని మలానీ బిల్డింగ్ వద్ద రథాన్ని నిలుపగా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే సికింద్రాబాద్ పరిధి ఇస్కాన్ ఆలయం ఆధ్వర్యంలో జగన్నాథ ఆలయంలో స్వామివారికి తెల్లవారు జాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంటలకు ఇస్కాన్ ఆలయం నుంచి జగన్నాథుడు, బలభద్ర, సుభద్రదేవి విగ్రహాలను రథంలో ఉంచి ఊరేగింపును ప్రారంభించారు.
ఈ యాత్ర ఇస్కాన్ ఆలయం నుంచి సెయింట్ మేరీస్ రోడ్డు, సంగీత్ చౌరస్తా మీదుగా సాగింది. ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఈ శోభాయాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ఇస్కాన్ టెంపుల్ సభ్యులు సాంబు వైష్ణవ్ దాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్ స్టేడియం నుంచి శ్రీ జగన్నాథ రథయాత్రను అంగరంగ వైభవంగా ప్రారంభించారు. రథయాత్ర ఎదుట మహిళలు, భక్తులు పెద్దత్తున హాజరై రంగు రంగుల ముగ్గులను వేసి స్వాగతం పలికారు.
ఈ రథయాత్ర ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమై ఆర్టీసీ క్రాస్రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ ఎక్స్రోడ్, లిబర్టీ, జీహెచ్ఎంసీ కార్యాలయం, లోయర్ ట్యాంక్బండ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, కట్టమైసమ్మ దేవాలయం, డీబీఆర్మిల్స్, చిల్డ్రన్స్ పార్క్, బుద్ధ భవన్ కుడివైపు సంజీవయ్య పార్క్, జలవిహార్ వరకు కీర్తనలు మహా హారతి కార్యక్రమాలతో జగన్నాథ రథయాత్రను వైభవంగా ఊరేగించారు. ఇస్కాన్ దేవాలయం సభ్యు లు వేదాంత ప్రభు, వర్థకృష్ణ ప్రభు, రాధేశ్యాం ప్రభు, సీతారాం ప్రభు నేతృత్వంలో వైభవంగా రథయాత్ర కొనసాగింది. ఈ రథయాత్రకు అడుగడుగునా భక్తులు హారతులు, పూలతో నీరాజనాలు పలికారు.రథయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆయా ప్రాంతాల్లో వందలామంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.