జవహర్నగర్, జూన్ 30: పదహారు లక్షల మంది ప్రజల ప్రాణాలతో రాంకీ చెలగాటమాడుతూ పర్యావరణ విధ్వంసం సృష్టించడం దుర్మార్గమని, వెంటనే చెత్తను తీసుకురావడం ఆపేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని డంపింగ్యార్డు ఎత్తివేత పోరాట జవహర్నగర్, దమ్మాయిగూడ జేఏసీలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి ఆధ్వర్యంలో మంగళవారం జవహర్నగర్ ప్రగతినగర్లోని నీలం రామచంద్రయ్యభవన్లో జవహర్నగర్, దమ్మాయిగూడ జేఏసీల సమావేశాన్ని నిర్వహించారు.
షేక్షావలి మాట్లాడుతూ డంపింగ్ యార్డులో నిల్వ ఉన్న చెత్తను బయోమైనింగ్ను ప్రారంభించాలని, మురుగునీటి ప్రవాహాన్ని అడ్డుకుని బాధిత ప్రజలకు ఉచితంగా తాగునీటి, వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. జీహెచ్ఎంసీ తక్షణమే ప్రత్యామ్నాయ సైట్లను ఏర్పాటు చేసి జవహర్నగర్కు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో శంకర్నారాయణ, మాజీ కార్పొరేటర్లు లలితాయాదవ్, వేణు, చిత్రసుబ్రహ్మణ్యం, సమ్మిరెడ్డి, మీరా, శివబాబు, నర్సింహగౌడ్, శంకర్, శివన్నారాయణ, ప్రవీణ్, చంద్రన్న, యాకస్వామి, పాషామియా, సునీత, అనంతలక్ష్మి, రాణి తదితరులు పాల్గొన్నారు.