HomeHyderabadJac Leaders Have Warned Tpcc Chief Revanth Reddy To Tender An Unconditional Apology For His Derogatory Remarks Against Minister Talasani Srinivas Yadav
రేవంత్.. క్షమాపణ చెప్పు
యాదవ సామాజికవర్గాన్ని, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కించపరిచే విధంగా మాట్లాడిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, మంగళవారం అర్ధరాత్రి 12గంటల వరకే డెడ్లైన్ విధిస్తున్నామని యాదవ, కురుమ సంఘాల జేఏసీ నాయకులు హెచ్చరించారు.
ఎక్కడికక్కడ అడ్డుకుంటాం
రేపు దున్నపోతులతో ర్యాలీ.. గాంధీభవన్ ముట్టడి
యాదవ, కురుమ సంఘాల జేఏసీ హెచ్చరిక
ఖైరతాబాద్, మే 23 : యాదవ సామాజికవర్గాన్ని, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కించపరిచే విధంగా మాట్లాడిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, మంగళవారం అర్ధరాత్రి 12గంటల వరకే డెడ్లైన్ విధిస్తున్నామని యాదవ, కురుమ సంఘాల జేఏసీ నాయకులు హెచ్చరించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ కన్వీనర్ కడారి అంజయ్య యాదవ్, కోకన్వీనర్ గోసుల శ్రీనివాస్ యాదవ్, మేకల రాములు యాదవ్, జేఏసీ ప్రతినిధులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజారాం యాదవ్, బైకాని శ్రీనివాస్ యాదవ్లు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎండగట్టారు. పేడలు పిసుక్కునే వారంటూ చులకనగా మాట్లాడి తన దొర అహంకారాన్ని ప్రదర్శించాడని అన్నారు.
వెంటనే క్షమాపణ చెప్పాలని యాదవ, కురుమ సంఘాలన్ని ముక్తకంఠంతో డిమాండ్ చేసినా నోరుమెదపడం లేదని మండిపడ్డారు. తమ సామాజికవర్గాన్ని తక్కువ అంచనా వేయకూడదని, రాష్ట్రంలో 20 శాతానికి పైగా జనాభా ఉన్నదని, తమ సత్తా ఏమిటో చూపుతామని అన్నారు. రేవంత్ రెడ్డి ఏ గల్లీలో తిరిగినా అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే 25న ఉదయం 10గంటలకు వేలాదిగా యాదవులు, కురుమలు దున్నపోతులతో ఇందిరాపార్కు నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అక్కడి నుంచి గాంధీ భవన్కు చేరుకొని ముట్టడిస్తామని హెచ్చరించారు. డెడ్లైన్ లోగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జేఏసీ ప్రతినిధులు గోవర్ధన్ యాదవ్, శ్రీహరి యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు అయోధ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి తెలపాలి
ఉస్మానియా యూనివర్సిటీ, మే 23 : రాష్ట్రంలోని యాదవ, కురుమలను అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తక్షణమే గొల్ల కురుమలు, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్కు క్షమాపణ చెప్పాలని ఓయూ జేఏసీ చైర్మన్ నక్క శ్రీశైలం యాదవ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 25న గాంధీభవన్ ముట్టడి తప్పదని హెచ్చరించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ రేవంత్రెడ్డి అహంకారంతో గొల్ల కురుమ జాతిని, వారి వృత్తి, జీవనశైలిని కించపరిచే విధంగా మాట్లాడారని మండిపడ్డారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ కాంగ్రెస్ పార్టీలో చేరి పదవి కొనుక్కోగానే తనకు తాను పెద్ద నాయకుడు అయిపోయినట్లు భావిస్తున్నాడని అన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జరుగబోయే పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శ్రీకాంత్యాదవ్, కావటి సతీశ్యాదవ్, చిరంజీవి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.