నగరంలో నిత్యం వేలాది వాహనాలతో కిక్కిరిసిపోయే ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం, రోజురోజుకు జనాభా, వాహనాల సంఖ్య పెరుగుతున్నా.. మెట్రో విస్తరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన వ్యూహం లేకుండా వ్యవహారిస్తోంది. జనావాసాలు ఉన్న చోటనే ప్రాజెక్టులు చేపట్టకుండా నిర్మానుష్య ప్రాంతాల్లో మెట్రో లైన్ల కోసం ఆరాటపడం కాంగ్రెస్ లోపభూయిష్ట పాలనకు నిదర్శనమని వేలెత్తి చూపుతున్నారు. జన సంచారమే లేని, ఇంకా రూపురేఖలు రాని ఫ్యూచర్ సిటీ మెట్రో మాయలో జనాలను మభ్య పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫ్యూచర్ సిటీ జపం చేస్తోంది. జనావాసాలు దట్టంగా ఉండి, నిత్యం ఐటీ ఉద్యోగులు, కూలీలు విద్యార్థులతో కిక్కిరిపోయే నగరంలోని ప్రధాన మార్గాలను గాలికొదిలేసి, ఎక్కడో ఫార్మా సిటీ పరిసరాల్లో ప్రతిపాదిస్తున్న ఫ్యూచర్ సిటీకి మెట్రో లైన్ వేస్తామనడం హాస్యస్పదంగా మారింది. అయితే ఫ్యూచర్ సిటీ మార్గాన్ని ఫేజ్-3గా మార్చాలని, ప్రభుత్వం అత్యంత అవసరమైన రూట్లకు ప్రాధాన్యత ఇవాలని నిపుణులు మొత్తుకుంటున్న రాష్ట్ర సర్కార్ మొండిగా ముందుకెళ్లింది.
అయితే ప్రజా సంచారమే లేని అడవుల్లోకి మెట్రో లైను ఎలా వేస్తారంటూ కేంద్రం ఈ విజ్ఞప్తిని తిరస్కరించింది. వేల కోట్లు ఖర్చు చేసి జనం లేనిచోట (ఫ్యూచర్సిటీ) మెట్రో వేస్తామంటే కుదరదంటూ కేంద్ర ప్రభుత్వం ఈ రూట్ను తిరస్కరించింది. సాంకేతిక కారణాలు, నిబంధనలు, లోపాలతో పక్కన పడేసింది. ఈ క్రమంలో అసలు ఫ్యూచర్ సిటీ వైపు ఉన్న జనాభా ఎంత? రద్దీ ఏ స్థాయిలో ఉంది.? ప్రస్తుతం ఉన్న రవాణా సదుపాయాలను ఆరాతీసిన కేంద్రం.. జనసంచారమే లేని ఫ్యూచర్ సిటీకి మెట్రో ఎందుకని ప్రశ్నించడంతో.. తదనంతరం రాష్ట్ర సర్కారు ఫ్యూచర్ సిటీ మెట్రోను ఫేజ్-3లో పెట్టాలంటూ చేసిన ప్రతిపాదనను కూడా కేంద్ర తిరస్కరించింది. దీంతో ఫ్యూచర్ సిటీకి మెట్రో లేనట్లేనని అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రజల డిమాండ్ బుట్టదాఖలు..
పాలకులకు నిజంగా నగర ప్రజల ప్రయాణ కష్టాలు తీర్చాలనే తపన ఉంటే ముందుగా జనావాసాలు దట్టంగా ఉన్న నగర రద్దీ మార్గాలపై దృష్టి పెట్టాలి. భవిష్యత్లో వచ్చే సిటీ కంటే ఇప్పుడు నరకం చూస్తున్న నగరవాసుల ప్రాధాన్యతలే ముఖ్యమని, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలు పక్కనబెట్టి, ప్రజావసరాల ప్రాతిపదికన మెట్రోఫేజ్-3ని పట్టాలెక్కించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు సుదీర్ఘ కాలంగా నార్త్ సిటీ వాసులు తమ ప్రాంతానికి మెట్రో మార్గాన్ని నిర్మించాలని చేసిన ప్రతిపాదనలను బుట్టదాఖలు చేస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు.. మెట్రో విస్తరణ పేరిట కాలయాపన చేస్తున్నాయని మండిపడుతున్నారు.